ఈ కోడ్లకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది?
చింతల భూపాల్రెడ్డి సంతాప సభలో వ్యకాస జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-సంస్థాన్నారాయణపురం
దేశ వినాశనానికే మోడీ ప్రభుత్వం లేబర్కోడ్లను తెచ్చిందని, కార్మికుల హక్కులను కాలరాస్తూ.. 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చిందని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ అన్నారు. కంపెనీ కమ్యూనల్ కోడ్లు కార్మికులకు మరణ శాసనాలుగా మారనున్నాయని చెప్పారు. చౌటుప్పల్లో చింతల భూపాల్రెడ్డితో తనకు 30 ఏండ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను ఎస్ఎఫ్ఐలో పని చేస్తున్నప్పటి నుంచి ఆయన గురించి తెలుసన్నారు. సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ కార్యదర్శివర్గ సభ్యులు, చౌటుప్పల్ మాజీ సర్పంచ్ చింతల భూపాల్ రెడ్డి సంతాప సభ శుక్రవారం పట్టణ కేంద్రంలోని ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్ల్లో పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ అధ్యక్షతన జరిగింది. భూపాల్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. ఉద్యమ నాయకులు చనిపోతే ప్రజా ఉద్యమాలకు తీరని నష్టమన్నారు. పుట్టుక.. చావు సహజమే అయినప్పటికీ బతికున్నంత కాలం ఎవరి కోసం పని చేశామన్నదే ముఖ్యమన్నారు. భూపాల్రెడ్డి తుది శ్వాస విడిచే వరకు పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల పక్షాన పని చేశారని గుర్తు చేశారు. ఖమ్మంలో సామినేని రామారావు బతికి ఉంటే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలువలేమనే కాంగ్రెస్ గుండాలు ఆయనను హత్యచేశాయని, దీంతో ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడిందని చెప్పారు. హత్యా రాజకీయాలను ప్రజాతంత్ర వాదులు ఖండించాలన్నారు. చింతల భూపాల్ రెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించడం ద్వారానే అమరుల ఆశయాలు నెరవేరుతాయని చెప్పారు. కమ్యూనిస్టులకు ఓట్లు తగ్గొచ్చు, సీట్లు తగ్గొచ్చు కానీ వాళ్లు ఉండాలని.. అనుకునే వాళ్లు ఇంకా అనేకమంది ఉన్నారని అన్నారు. కమ్యూనిస్టులకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు ప్రజా సమస్యల పరిష్కారమే ముఖ్యమన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్పారు. ఆ మేరకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందన్నారు. ఈ విషయంపై తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పైకి మాత్రమే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు నటిస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం మళ్లీ మూడు నల్ల చట్టాలను తెచ్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్ కంపెనీ యజమానులకు దోచిపెడుతూ రైతులను, కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్లూరి మల్లేష్, మాటూరు బాలరాజ్, బూరుగు కృష్ణారెడ్డి, జి.శ్రీనివాస చారి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు ఉజ్జని యాదగిరిరావు, చౌటుప్పల్ మాజీ మున్సిపల్ చైర్మెన్ వెన్రెడి రాజు, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు దోనూర్ నర్సిరెడ్డి, సుర్కటి శ్రీనివాస్ రెడ్డి, ఎండి పాషా, గంగాదేవి సైదులు పాల్గొన్నారు.



