Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలులేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందే

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందే

- Advertisement -

– ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాల్సిందే
– కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జులై 9న సార్వత్రిక సమ్మె
– కార్మికులంతా జయప్రదం చేయాలి : ఆల్‌ ట్రేడ్‌ యూనియన్ల నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాల్సిందేననీ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆపాల్సిందేనని కేంద్ర, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో కార్మిక పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేస్తూ జులై 9న దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఎంఎస్‌ ఆఫీసులో ఉదరు భాస్కర్‌ అధ్యక్షతన కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్ల రాష్ట్ర సదస్సు జరిగింది. ఆర్‌.డి. చంద్రశేఖర్‌, విజరుకుమార్‌ యాదవ్‌ (ఐఎన్‌టీయూసీ), ఎస్‌.బాల్‌రాజ్‌, ఎం.నర్సింహా (ఏఐటీయూసీ), శంకర్‌రావు, రెబ్బా రామారావు, అంజాద్‌(హెచ్‌ఎంఎస్‌), పాలడుగు భాస్కర్‌, జె. వెంకటేష్‌, కుమారస్వామి(సీఐటీయూ), ప్రవీణ్‌ (టీయూసీఐ), అనూరాధ (ఐఎఫ్‌టీయూ), ఎంకె. బోస్‌, ప్రసాద్‌ (టీఎన్‌టీయూసీ), వి. నాగేశ్వరరావు (సీజీ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షులు) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..11 ఏండ్ల ఎన్‌డీఏ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్‌ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నదని విమర్శించారు. పోరాటాల ద్వారా సాధించుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను ముందుకు తెచ్చిందనీ, దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెడుతున్న తీరును ఎండగట్టారు. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్‌ గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను మోడీ సర్కారు విస్మరిస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకు నేందుకు రాష్ట్ర కార్మికవర్గం పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జులై 9 సమ్మె కోసం తలపెట్టిన కార్యాచరణను జె. వెంకటేష్‌(సీఐటీయూ) ప్రవేశపెట్టారు. శ్రీనివాస్‌(ఏఐటీయూసీ) వందన సమర్పణ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -