Tuesday, August 19, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపెట్టుబడిదారీ విధానంతోనే భూకబ్జాలు

పెట్టుబడిదారీ విధానంతోనే భూకబ్జాలు

- Advertisement -

– తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు
– నూతన రూపాల్లో భూజమీందార్లు
– గ్రామీణ ధనిక వర్గాల అన్యాక్రాంతం అవుతున్న భూములు
– మోడీ సర్కార్‌ భూమాఫియాను అడ్డుకోకపోతే నయా వెట్టి చాకిరీ : బి.వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”నాటి జమీందారీ, జాగిరీదారి, దేశముఖ్‌లను వీరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఓడించి భూవికేంద్రీకరణకు శ్రీకారం చుట్టింది. భూసిలింగ్‌ చట్టాలను తెచ్చింది. స్వల్ప సంఖ్యలోనైనా భూపంపిణీకి అవకాశం కల్పించింది. నేడు పాలక వర్గాల మద్ధతుతో వివిధ రూపాల్లో నూతన పెట్టుబడిదారీ విధానం భూకబ్జాలకు పాల్పడుతుంది. నాటి దేశముఖ్‌ల పాత్రనే నేటి గ్రామీణ ధనికులు, నాటి జమీందార్ల తరహాలోనే నేటి పెట్టుబడిదారీ భూస్వాములు భూములపై ఆధిపత్యానికి పాల్పడుతున్నారు. అభివృద్ది ముసుగు తొడిగి మోడీ సర్కార్‌ భూరక్షణ చట్టాలను ధనవంతులకు, కంపెనీలకు అనుకూలంగా సవరిస్తున్నారు. వీటిని అడ్డుకోక పోతే గ్రామీణ పేదలు నయా వెట్టికి నెట్టబడతారు… ” అని అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం మహారాష్ట్ర 12వ రాష్ట్ర మహాసభ సందర్భంగా జరిగిన భారీ బహిరంగసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బిడ్‌ జిల్లా మెల్గాన్‌ పట్టణంలో ఆదివారం ప్రారంభమైన సంఘ మహాసభలు మంగళవారం వరకు కొనసాగుతాయి. భారీ వర్షాల్లో కూడా వేల మంది ప్రజలు మహాసభలో పాల్గొన్నారు. ”బీడ్‌ జిల్లా నాటి హైదరాబాదు సంస్థానంలో ఉండేది. గంగాధరప్ప భూరండే నాయకత్యంలో దేశ్‌ ముఖ్‌ లను ఓడించి సాగుదార్లకు భూములు పంచారు. నాటి వారసత్వం ఇంకా గ్రామాల్లో ఉంది. నేటి బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ది పేరు చెప్పి లక్షల ఎకరాల భూ సేకరణ చేస్తున్నారు. పేదల భూములను బలవంతంగా లాక్కుని కంపెనీలకు అప్పగిస్తున్నారు. రాజకీయ నాయకులు, కంపెనీలు కలిసి భూకబ్జాలకు పాల్పడుతున్నారు. అందుకు ప్రభుత్వాలు అన్ని రకాలుగా సహకరిస్తున్నాయి. ప్రభుత్య అండతో భూమాఫియా రెచ్చిపోతోంది. ఇప్పటికే భూమి లేక, పనులు దొరకక లక్షల మంది నాటి నిజాం నవాబుల పాలనలో ఉన్న ప్రాంతాల నుంచి వలసలు పోతున్నారు. చెరకు పంట కటింగ్‌ కూలీలు అంటే మరాఠ్వాడే గుర్తుకు వస్తుంది…. ” అని వెంకట్‌ అన్నారు. ఈ సభల్లో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్‌ నవ్లె మాట్లాడుతూ మహారాష్ట్రలో జరిగిన లాంగ్‌ మార్చ్‌ను గుర్తు చేశారు. సభలో మాజీ న్యాయమూర్తి తూగిడి, సంఘ నాయకులు బలేరం, మారుతి, సరిత, నాథు, వినోద్‌, మాంజాల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad