ట్రంప్ బెదిరింపులకు మదురో కౌంటర్ ఎటాక్
కారకాస్లో దేశాధ్యక్షుడికి మద్దతుగా భారీ ప్రదర్శన
కారకాస్ : తమ దేశం శాంతిని కోరుకుంటోందని వెనిజులా అధక్షుడు నికొలస్ మదురో పునరుద్ఘాటించారు. అయితే అది సార్వభౌ మత్వం, సమానత్వం, స్వేచ్ఛ ను కలిగి ఉండాలని స్పష్టం చేశారు. బానిసత్వంతో కూడిన శాంతి తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. వెనిజులాపై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన జాతీయ భద్రతా బృందంతో శ్వేతసౌధంలో సమావేశమైన నేపథ్యంలో కారకాస్లోని మిరాఫ్లోర్స్ ప్యాలెస్ వెలుపల దేశాధ్యక్షుడు మదురోకు మద్దతుగా సోమవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వెనిజులా పతాకాలతో ర్యాలీకి హాజరైన వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తూ దేశ ప్రజలకు పూర్తిగా విధేయుడిగా ఉంటానని చెప్పారు. ‘మేము బానిసత్వంతో కూడిన శాంతిని కోరుకోవడం లేదు. అలాగే కాలనీల శాంతిని కూడా కోరుకోవడం లేదు’ అని మదురో చెప్పారు. ‘మానసిక ఉగ్రవాద’ ప్రచారం సాగిస్తున్న అమెరికాపై ఆయన నిప్పులు చెరిగారు. గత 22 వారాలుగా అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఈ కాలం తమకు ఓ పరీక్ష పెట్టిందని, మాతృభూమిపై తమకు ఉన్న ప్రేమను వెనిజులా ప్రజలు ప్రదర్శించారని మదురో తెలిపారు.



