రద్దయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం
జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ వెల్లడి
ఘనంగా సంస్థ వ్యవస్థాపక దినోత్సవం
నవ తెలంగాణ – బిజినెస్ బ్యూరో
ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) 69వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆ సంస్థ హైదరాబాద్ జోనల్ కార్యాలయంలోనూ నిర్వహించారు. దీనికి దక్షిణ మధ్య జోన్ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ హాజరై ఎల్ఐసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ.. 1956లో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5 కోట్లతో ప్రారంభమైన ఎల్ఐసీ.. ప్రస్తుతం రూ.56,22,923 కోట్ల ఆస్తుల సంపదతో అభివృద్ధి చెందిందన్నారు. బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 2024 ప్రకారం ఎల్ఐసీ ప్రపంచంలోనే నంబర్ వన్ బీమా బ్రాండ్గా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎల్ఐసీ ప్రస్తుతం 35 విభిన్న పథకాలను అందిస్తోందన్నారు. ఇందులో ఎండోమెంట్, టర్మ్ అస్యూరెన్స్, చిల్డ్రన్, పెన్షన్, మైక్రో ఇన్సూరెన్స్, యూనిట్ లింక్డ్ ఉత్పత్తులు వివిధ వర్గాల అవసరాలను తీరుస్తున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సాధికారత కోసం ఎల్ఐసీ ప్రవేశపెట్టిన బీమా సఖి కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 48,882 మహిళా ఏజెంట్లను నియమించినట్టు ఆయన తెలిపారు. గడువు ముగిసిన పాలసీల పునరుద్ధరణ కోసం 30 శాతం వడ్డీ రాయితీతో పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోందనన్నారు. ఇది 2025 అక్టోబర్ 17 వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని నివారించి, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అంకితభావంతో పనిచేయాలని ఉద్యోగులు, ఫీల్డ్ సిబ్బందికి ఆయన సూచించారు. ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి సీనియర్ ఉద్యోగులు రాజేష్ భరద్వాజ్, ఎం రవి కుమార్, శరవణ రమేష్, జిఎస్ శాస్త్రీ, పిజి కుమార వైద్యలింగం, ఎఎఎం హిలాలీ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ఐసీలో 35 విభిన్న పథకాలు
- Advertisement -
- Advertisement -