నవతెలంగాణ-హైదరాబాద్: ఉత్తర సిక్కింలో గల్లంతైన వారిలో లెఫ్టినెంట్ కల్నల్, ఆయన భార్య రిటైర్డ్ స్వాడ్రన్ లీడర్, వారి కుమార్తెలు కూడా ఉన్నారని అధికారులు బుధవారం తెలిపారు. ఉత్తర సిక్కింలోని ఛాతెన్ వద్ద గల సైనిక శిబిరంపై ఆదివారం రాత్రి కొండచరియలు విరిగిపడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మరణించగా, తొమ్మిది మంది గల్లంతైన సంగతి తెలిసిందే. గల్లంతైన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రిత్పాల్ సింగ్ సంధు, రిటైర్డ్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారి ఆర్తీ సంధు, వారి కుమార్తె అమైరా సంధు, సుభేదార్ ధరమ్వీర్, నాయక్ సునీలాల్ ముచాచారి మురియు సిపాయి పి.కె. సైనుధీన్లు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అన్నారు.
గల్లంతైన వారికోసం అన్వేషణ కొనసాగుతోందని, అత్యవసర చర్యలు చేపడుతున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యాధునిక పరికరాలతో పాటు సైన్యం ప్రత్యేక బృందాలను మోహరించిందని పేర్కొంది. అననుకూల వాతావరణం, ఎత్తైన కొండలు, బురద నేలలు సహాయక చర్యలకు సవాళ్లుగా నిలిచాయని వెల్లడించింది. పర్యాటకానికి ప్రధాన కేంద్రమైన లాచెన్ గ్రామంతో సంబంధాలు తెగిపోయాయని గువహటికి చెందిన రక్షణ ప్రతినిధి పేర్కొన్నారు. చిక్కుకుపోయిన 113మంది పర్యాటకులను త్వరలోనే తరలించేందుకు సైన్యం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. జూన్3న వాతావరణం అనుకూలించడంతో కొంతమంది విదేశీయులు సహా 30మంది పర్యాటకులను సైనిక హెలికాప్టర్ల ద్వారా తరలించారని అన్నారు.