– ఎస్సై జుక్కల్ నవీన్ చంద్ర
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని శక్తి నగర్ లో పేకాట ఆడుతున్న 11మందిని అరెస్టు చేసినట్టు జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా పేకాట ఆడుతూ 11 మంది పట్టు పడ్డారని అన్నారు. వారి వద్ద నుంచి రూ. 3,130, ఐదు మొబైల్ ఫోన్లు జప్తు చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మండలంలోని గ్రామాలలో పేకాట ఆడడం, డ్రగ్స్, గంజాయి, మత్తుమందులకు బానిసలుగా మారడం, అసాంఘిక కార్యకలాపాలు మట్కా, గుట్కా, అక్రమ ఇసుక రవాణ, మోసం చేయడం, అక్రమాలకు పాల్పడితే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెడు వ్యసనాలకు అలవాటు కావద్దని సూచించారు. దురలవాట్లు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయని సూచించారు. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకొని కుటుంబాలతో సంతోషంగా గడుపాలని సూచించారు. మండల పరిధిలోని గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే జుక్కల్ పీఎస్ ఫోన్ చేయాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.