వచ్చే వారం లాభాలకు అవకాశం
కాల్పుల విరమణతో ఇన్వెస్టర్లలో ఆశలు
ముంబయి : వచ్చే వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో మే7తో ప్రారంభం కానున్న వారంలో దలాల్ స్ట్రీట్లో కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్లు, పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో గడిచిన రెండు నెలలుగా తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతోన్న మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొననుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా టారిఫ్లను వెనక్కి తీసుకోనున్నారని అంచనాలు వెలుపడుతున్నాయి. ఈ రెండు సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య గడిచిన వారంలో భారత మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వారాంతం సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 880 పాయింట్లు పతనమై 80వేల దిగువకు పడిపోయింది. ఇంతక్రితం గురువారం సెషన్లోనూ 411 పాయింట్లు నష్టపోయింది. దీంతో రెండు సెషన్లలో ఇన్వెస్టర్లు దాదాపు రూ.7 లక్షల కోట్లు పైగా సంపదను కోల్పోయారు.
ఈక్విటీ ఫండ్లలో భారీగా తగ్గిన పెట్టుబడులు
వరుసగా నాలుగో నెలలోనూ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన ఏప్రిల్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల లోకి పెట్టుబడులు 3.24 శాతం తగ్గి రూ.24,269 కోట్లకు పరిమిత మైనట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) ఓ రిపోర్టులో వెల్లడించింది. ట్రంప్ టారిఫ్ భయాలకు తోడు భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకాడారు. ఏడాదికేడాదితో పోల్చితే డెట్ ఫండ్స్ రూ.2.02 లక్షల కోట్ల నుంచి రూ.2.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇండిస్టీ నికర ఎయుఎం విలువ రూ.69,99,837.94 కోట్లుగా చోటు చేసుకుంది. మార్చి నెల చివరినాటికి ఇది రూ.65,74,287.20 కోట్లుగా ఉంది.
మార్కెట్లలో శాంతి కాంతులు..!
- Advertisement -
- Advertisement -