10 కిలోల వరకు తాకట్టుకు ఆర్బీఐ అనుమతి
ముంబయి : ఇప్పటి వరకు బంగారంపై రుణాలను అందిస్తున్న బ్యాంక్లు, ఇతర విత్త సంస్థలు త్వరలోనే వెండి తనఖా రుణాలను ఇవ్వనున్నాయి. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. వచ్చే 2026 ఏప్రిల్ 1 నుంచి వాణిజ్య బ్యాంక్లు, బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్బీఎఫ్సీ)లు వెండి ఆభరణాలు, నాణేలపై రుణాలు ఇవ్వడానికి అనుమతిని మంజూరు చేసింది. ఈ కొత్త నిబంధనలు గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక మద్దతును పెంచుతాయని ఆర్బీఐ భావిస్తోంది.
ఒక వ్యక్తి గరిష్టంగా 10 కిలోల వెండి ఆభరణాలు లేదా 500 గ్రాముల వెండి నాణేలను తాకట్టు పెట్టి రుణం పొందడానికి వీలుంటుంది. వెండి విలువలో గరిష్టంగా 85 శాతం వరకు రుణంగా ఇవ్వవచ్చు. అయితే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ను నిరోధించడానికి ప్రాథమిక వెండి బిస్కెట్లు, కడ్డీలపై మాత్రం రుణాలు అనుమతించడం లేదు. గతంలో కేవలం బంగారు రుణాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులు త్వరలో వెండిని కూడా తాకట్టుగా స్వీకరించడం ద్వారా తమ పోర్ట్ఫోలియోను విస్తరించుకోవడానికి, కొత్త ఖాతాదారులను పెంచుకోవడంతో పాటు వాటి వ్యాపారం పెరగనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.



