నవతెలంగాణ-హైదరాబాద్: నేటితో రెండో విడత నామినేషన్ల గడువు ముగిసింది. రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లలో భాగంగా 4332 సర్పంచ్ స్థానాలకు 12479 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇటీవల మొదటి దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలకు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది.
38342 వార్డు మెంబర్ స్థానాలకు 30040 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడత నామినేషన్ల స్వీకరణలో రెండు రోజుల్లో సర్పంచ్ స్థానాలకు 8198 నామినేషన్లు, 11502 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలు అయినట్లు వెల్లడించారు. మొదటి విడతలో 189 మండలాల్లోని 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించనున్నది.
డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే, అదే రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు చేపట్టి వార్డు సభ్యులు, సర్పంచుల ఫలితాలను వెల్లడిస్తారు. మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3 నుంచి స్వీకరించనున్నారు.


