నవతెలంగాణ-హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలక రాకెట్ ప్రయోగం చేపట్టింది. ‘సీఎంఎస్-03’ ఉపగ్రహంతో కూడిన ‘ఎల్వీఎం3-ఎం5’ వాహక నౌక శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి దీన్ని ప్రయోగించారు. ఈ ఉపగ్రహం బరువు 4,410 కిలోలు. దీన్ని జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (జీటీవో)లోకి ప్రవేశపెట్టనున్నారు. భారత భూభాగం నుంచి ఈ కక్ష్యలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకీ ఇదే అత్యంత బరువైనది.
సీఎంఎస్-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధనౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పాటు అందిస్తుంది. దీన్ని జీశాట్-7ఆర్ అని కూడా పిలుస్తారు. 2013 నుంచి సేవలు అందిస్తున్న జీశాట్-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు.


