నవతెలంగాణ-హైదరాబాద్: పోలవరం మునక ప్రాంతాల్లో ఆగష్టు 16, 17 తేదీల్లో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ, రాజ్యసభలో సీపీఐ(ఎం) ఫ్లోర్లీడర్ జాన్ బ్రిట్టాస్ పర్యటించనున్నారు. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం పర్యటన వివరాలు వెల్లడించారు.
పర్యటనలో భాగంగా ఎం.ఏ.బేబీ 16 వతేదీ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడ నుండి రంపచోడవరం దగ్గరున్న దేవీపట్నం మండలంలో పెనికెలపాడు, ఇందుకూరు, తాల్లూరు నిర్వాసిత కాలనీల్లో పర్యటిస్తారని తెలిపారు. జాన్ బ్రిట్టాస్ 16వ తేదీన విజయవాడ చేరుకుని ఏలూరు జిల్లాలో ఉన్న జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం మండలాల్లో ప్రజలను కలుసుకుని వారి సమ్యలు అడిగి తెలుసుకుంటారని వివరించారు.
17 వతేదీ బేబీ, బ్రిట్టాస్ చింతూరు, విఆర్పురం, కూనవరం, ఎటపాక మండలాల్లో ఉభయులూ పర్యటించనున్నారని వివరించారు. మధ్యాహ్నం తిరుగు ప్రయాణమై ఢిల్లీకి వెళతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజలను కోరారు.
పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా చేస్తున్నా నిర్వాసితులను పట్టించుకోవడం లేదని శ్రీనివాసరావు తెలిపారు. ప్రాజెక్టు కోసం జీవనాన్ని ధారపోసిన గిరిజనులు అభద్రతా భావంతో బతుకుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో వారి సమస్యలు అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి పార్టీ నాయకులు పర్యటిస్తున్నారని పేర్కొన్నారు.