వ్యక్తిగత విభాగంలో జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధి రామ సత్యం…
అభినందించిన ఎమ్మెల్యే జారే…
నవతెలంగాణ – అశ్వారావుపేట : జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదేశానుసారం పాఠశాలల్లో నిర్వహించిన విత్తన సేకరణ చాలెంజ్ లో మండలంలోని ఎంపీపీ ఎస్ మామిళ్ళవారిగూడెం మొదటి వరుసలో ఉంది. వ్యక్తిగత విభాగంలో జెడ్పీ హెచ్ ఎస్ అశ్వారావుపేట 7వ తరగతి విద్యార్ధి రామ సత్య సతీష్ ప్రధమ స్థానంలో నిలిచాడు. మండలంలో 35 పాఠశాలలు విత్తన సేకరణలో పాల్గొన్నాయి. ఇందులో ఎంపీపీఎస్ మామిళ్ళవారిగూడెం విద్యార్ధులు మండల మొత్తంలోనే అత్యధికంగా 60 రకాల విత్తనాలను 25 కేజీలు సేకరించారు.
అశ్వారావుపేట కాంప్లెక్స్ పరిధిలో నిర్వహించిన సేకరణలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 20 కేజీల విత్తనాలను సేకరించి సముదాయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాల స్థాయిలో అధికంగా విత్తనాలు సేకరించి ఏడవ తరగతి చదువుతున్న రామ సత్య సతీష్ వ్యక్తిగతంగా ప్రథమ స్థానంలో నిలిచాడు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవ ఈ విద్యార్థికి స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తన సేకరణలో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను నాటి, ఆ విషయాన్ని పదిమందికి తెలియచేయాలని తెలిపారు. తద్వారా మొక్కలు నాటే ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎంఈఓ పొన్నగంటి ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత మండల అధికారులు,అటవీ సిబ్బంది,,ప్రజా ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.