– అభ్యర్థులు విత్ డ్రా చేసుకునేందుకు వస్తే అధికారులు లేరు
– జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు ఫోన్ ద్వారా పిర్యాదు
– మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై అభ్యర్థుల ఆగ్రహం
నవతెలంగాణ -శివ్వంపేట :
ఎన్నికల వేళ మండల ఎన్నికల అధికారులు మండల కార్యాలయానికి రాకపోవడంతో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట ఎంపీపీ కార్యాలయంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు 24 గంటలు మండల ఎన్నికల అధికారులు అందుబాటులో ఉండాలని నిబంధనలు ఉంది. కానీ మండల ఎన్నికల అధికారి, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ మధ్యాహ్నం 12 గంటలైన కార్యాలయానికి రాకపోవడంతో ఎన్నికల నుండి తమ నామినేషన్ ఉపసంహరించుకునే అభ్యర్థులు అధికారుల కోసం పడిగాపులు పడుతున్నారు.
ఎన్నికల అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఫోన్ ద్వారా ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మకు సమాచారం అందించగా అభ్యర్థులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 9వ తేదీ వరకు విత్ డ్రా ఉండగా మీకు ఎందుకంత తొందరని అసహనం వ్యక్తం చేసినట్లు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారులు అభ్యర్థులకు అందుబాటులో లేని విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగాయిపల్లి గోపి ఎంపీపీ కార్యాలయానికి చేరుకొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ కు ఫోన్ ద్వారా పిర్యాదు చేశారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో మండల కార్యాలయానికి చేరుకున్న ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ పై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.



