వీధికుక్కల నిర్వహణ, గో సంరక్షణపై చర్చ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డితో ప్రముఖ జంతు సంరక్షకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదివారం బేటీ ఆయ్యారు. రాష్ట్రంలోని మున్సిపాల్టీల్లో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. వీధి కుక్కల స్టెరిలైజేషన్ వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఆమెకు వివరించారు. రాష్ట్రంలో గో సంరక్షణకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిందనీ, అత్యాధునిక సౌకర్యాలతో ఎన్కేపల్లిలో గోశాల నిర్మాణానికి శంకుస్ధాపన చేసినట్టు సీఎం తెలిపారు. రాష్ట్రంలో గుర్తించిన వివిధ ప్రాంతాలు, ఆలయాల సమీపంలో గోశాలల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వివరించారు. జంతు సంరక్షణ విషయంలో ప్రభుత్వ చర్యలపై మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



