డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్
న్యూఢిల్లీ : భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బత్ర ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. బ్రెజిల్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో క్వార్టర్ఫైనల్కు చేరుకున్న మనిక బత్ర.. సెమీఫైనల్ ముంగిట నిరాశపరిచింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో జపాన్ అమ్మాయి, నాల్గో సీడ్ హషిమోటో చేతిలో 0-3తో మనిక బత్ర పరాజయం పాలైంది. 7-11, 6-11, 7-11తో వరుసగా మూడు సెట్లలో తేలిపోయిన మనిక బత్ర.. ప్రీ క్వార్టర్స్లో దక్షిణ కొరియా అమ్మాయిపై చూపించిన జోరు పునరావృతం చేయలేకపోయింది. పురుషుల డబుల్స్లో టాప్ భారత జోడీ మనుశ్ షా, మానవ్ ఠక్కర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. రెండో సీడ్ బెనెడిక్ట్, డాంగ్ (జర్మనీ) జోడీ చేతిలో 2-3తో మనుశ్, మానవ్ పోరాడి ఓడారు. 3-11, 11-7, 7-11, 15-13, 5-11తో ఐదు సెట్ల పాటు పోరాడినా.. నిర్ణయాత్మక సెట్లో మనోళ్లు అంచనాలు అందుకోలేదు. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్కు చేరుకున్న మనుశ్ షా, దియ చితాలె టైటిల్ పోరులో జపాన్ క్వాలిఫయర్స్ ఎయిడా, హషిమోటో జంటతో పోటీపడనున్నారు. ఈ టోర్నమెంట్లో రెండు విభాగాల్లో భారత ప్యాడ్లర్లు ఫైనల్కు చేరుకోవటం విశేషం.
మనిక పరాజయం
- Advertisement -
- Advertisement -