నవతెలంగాణ – దుబ్బాక
అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని తిమ్మాపూర్ లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్ హెచ్ఓ కే. కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన పెద్దోళ్ల సుష్మ (32) శ్రీకాంత్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కొంతకాలంగా భర్త, అత్త,మామల నుంచి పలు రకాలుగా వేధింపులు ఎక్కువైనట్లు సుష్మ తన తల్లిదండ్రుల వద్ద తరచూ వాపోయేది.
శనివారం ఉదయం ఎవరు లేని సమయంలో తిమ్మాపూర్ లోని భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు సుష్మ పుట్టింటి వారికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాకలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమార్తె మృతికి అల్లుడు శ్రీకాంత్, అత్త ఎల్లవ్వ, మామ బాబు లపై అనుమానం ఉందంటూ మృతురాలి తల్లి ఎల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


