నవతెలంగాణ – గోవిందరావుపేట
పస్రా గ్రామపంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో జరగబోయే బోనాల పండుగకు ఉత్సవ కమిటీ వాళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం గ్రామ పెద్దలు యువత మహిళలు కలిసి బోనాల పండుగను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ప్రతి సంవత్సరం సంప్రదాయంగా జరిగే పోచమ్మ తల్లి బోనాల పండుగ ఈసారి ఆగస్టు6 బుధవారం ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. పస్రా రాంపూర్ ముత్యాలమ్మ (పోచమ్మ బోనాలు) ఈ బుధవారం శుభదినం సందర్భంగా భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి.
పండుగ సందర్భంగా ఉదయం నుంచే గ్రామంలోని గల్లీ గల్లీ భక్తుల కేరింతలతో, డప్పు మోగింపులతో సందడి కానుంది. సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు తలపై బోనాలూ, చేతిలో కొబ్బరికాయలు, పసుపు కుంకుమలు, పూలతో నిండిన పాత్రలు మోసుకుని ఊరంతా ఊరేగుతారు. యువత డప్పుల మ్రోగింపులతో ఉత్సాహాన్ని రెట్టింపు చేయనున్నారు.
బోనాల అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు, ప్రసాదాల పంపిణీ, సాంప్రదాయ ఆటపాటలతో పండుగ కొనసాగనుంది. గ్రామంలోని పెద్దలు అందరూ భక్తులంతా సమయానికి విచ్చేసి, బోనాల పండుగను ఘన విజయవంతం చేయాలని ఆలయ కమిటీ వారు కోరుతున్నారు..