నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటకలో భారీ దోపిడీ జరిగింది. ఆర్మీ తరహా దుస్తుల్లో వచ్చిన ముగ్గురు సాయుధ దుండగులు సుమారు 20 కోట్ల రూపాయల విలువైన నగలను, కోటి రూపాయల నగదును దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకోని చడచన్ పట్టణంలోని ఎస్బిఐ బ్రాంచ్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
వివరాల ప్రకారం.. ఆర్మీ తరహా యూనిఫామ్ ధరించిన ముగ్గురు దుండగులు బ్యాంక్లోకి ప్రవేశించారు. మేనేజర్ మరియు ఇతర ఉద్యోగుల చేతులను కట్టేసి, టాయిలెట్ లోపల బంధించారు. దోపిడీ సమయంలో బ్యాంక్ మేనేజర్ అలారమ్ బెల్ను నొక్కకుండా ఆయుధాలతో బెదిరించారు. సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్లి నగదు, ఆభరణాలను దోచుకువెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న చడచన్ పోలీస్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ నింబార్గి, సీనియర్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నకిలీ నంబర్ ప్లేట్ కలిగిన వ్యాన్ను వినియోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
బ్యాంకు దోపిడీ అనంతరం దొంగల ముఠా మహారాష్ట్రలోని పంధర్పూర్ వైపు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. సోలాపూర్ జిల్లా సమీపంలో ప్రమాదం జరిగిందని, అక్కడ స్థానికులతో వాగ్వివాదానికి దిగినట్లు తెలిపారు. అనంతరం ద్విచక్రవాహనంపై అక్కడి నుండి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.