Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి

మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -

– అధికారులు సమన్వయంతో కృషి చేయాలి : మంత్రి సీతక్క
నవతెలంగాణ – ములుగు

జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం మహా జాతర అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. పనుల్లో నాణ్యత పాటించి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలన్నారు. ములుగు జిల్లా మేడారంలోని ఐటీడీఏ అతిథి గృహంలో జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ టిఎస్‌, ఐటీడీఏ పీఓ చిత్రమిశ్రాతో కలిసి పూజారులు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం సాయంత్రం మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పనులు, మాస్టర్‌ ప్లాన్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ను ఆర్కియాలజిస్ట్‌, వివిధ శాఖల అధికారులు ఏఏ దశల్లో ఉన్నాయో మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. జాతర లోపు మొదటి విడత పనులను పూర్తి చేయాలన్నారు. గద్దల ప్రాంగణం విస్తరణ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల స్థలం మార్పులు, లైన్‌ల విస్తరణ, నూతన మీడియా పాయింట్‌ భవనం, ముఖ్యమంత్రి అతిథి భవనం, పూజారుల వసతి భవనం తదితర నిర్మాణాలకు త్వరితగతిన టెండర్లు పూర్తి చేయాలన్నారు. గద్దెలను వరుస క్రమంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంపత్‌రావు, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గరావు, ఈఓ వీరస్వామి, ఇంజినీరింగ్‌ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -