Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమనోవ్యథ… తీరేదెలా?

మనోవ్యథ… తీరేదెలా?

- Advertisement -

– క్షణికావేశం…అనర్థాలకు మూలం
– ఆత్మీయత పంచి, ఆలోచనలు మార్చే ‘టెలిమానస్‌’
– ఆత్మహత్యలు, ఆరోగ్య సమస్యలపై ఫోన్‌లో నిపుణుల కౌన్సిలింగ్‌
– మూడేండ్లలో 21 లక్షల ఫోన్‌కాల్స్‌
– రోజూ మూడున్నరవేల మంది హెల్ప్‌లైన్‌ నెంబర్లను సంప్రదిస్తున్న వైనం
– సమాజంలో పెరుగుతున్న మానసిక ఆందోళనలు, రుగ్మతలు
చదువు పాడుచేసుకోవద్దన్నందుకు పదో తరగతి విద్యార్థిని తల్లిని చంపేసింది. మానసిక ఒత్తిడిని భరించలేక మరో యువతి రైలు పట్టాలపై కారు నడిపి హల్‌చల్‌ చేసింది. హృదయవేదన భరించలేక ఓ జర్నలిస్టు ఉరికొయ్యకు వేలాడింది. తండ్రి బైక్‌ కొనివ్వలేదని బాలుడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పంట పండలేదని ఓ రైతు పురుగుల మందు తాగి జీవిడిచాడు. ఒకటి కాదు…రెండు కాదు…కారణాలు ఏవైనా నిత్యం ఇలాంటి ఘటనలు కోకొల్లలు. పొద్దున్నే పేపర్‌ తిరగేసినా, టీవీ పెట్టినా, స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌ చేసినా ఇలాంటి వార్తలు మనసును కలిచేస్తూ…ప్చ్‌…అని నిట్టూర్పు విడిచేలా చేస్తాయి. ఇంత చిన్న విషయానికే ఆత్మహత్య చేసుకోవాలా… అని మనం అనుకోవచ్చుకానీ…అప్పటికి వాళ్లకు అదే పెద్ద సమస్య. ఆ క్షణంలోనే ధైర్యం చెప్పి, ఓదార్చే చేతులు ఉండాలి టెలిమానస్‌ ఆ లోటు తీరుస్తుంది.
కొత్తూరు ప్రియకుమార్‌

మనసు…అది ప్రత్యేకంగా కనిపించేదేం కాదు. కానీ మనిషి జీవితాన్ని శాసిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉన్నంతవరకు జీవితం సంతోషంగానే ఉంటుంది. అది డిస్టర్బ్‌ అయితేనే సమస్యలు చుట్టు ముట్టేస్తాయి. నెగటివ్‌ ఆలోచనలు మస్తిష్కాన్ని మసకబారుస్తాయి. ‘నా’ అనుకునే వాళ్ల్లు దూరం అయితేనో, జీవితంలో సక్రమమైన స్నేహం, తోడు లేకుంటేనో, నమ్మకద్రోహం, అణచివేత, ఆందోళన, ఆవేదన, భవిష్యత్‌పై భయం ఏర్పడితే కలిగే మనోవ్యథ మనసును అల్లకల్లోలం చేస్తుంది. ఆ సమయంలోనే జీవితం వృథా…నాకెవరూ లేరు అనే బలహీనక్షణాలు మనిషిని కుంగుబాటుకు గురి చేస్తాయి. ఆ ఒక్క క్షణాన్ని ఆత్మస్థైర్యంతో దాటే యగలిగితే, ఆ తర్వాత జీవితం దానంతట అదే రాటుదేలుతుంది. బలమైన నిర్ణయాలు బతుకును ధైర్యంగా ముందుకు తీసుకెళ్తాయి. ఆవేశంలో తీసుకొనే నిర్ణయాలు ఎంతటి అనర్థదాయకమో అర్థమైపోతుంది. ఆ ‘ఒక్క క్షణమే’ మనిషి జీవితంలో కీలకం. దాన్ని షేర్‌ చేసు కొనే ఆత్మీయత కావాలి. బతుక్కి భరోసా కల్పించి, ధైర్యాన్ని చెప్పే నేస్తం కావాలి. కొన్ని విషయాలను ప్రత్యక్షంగా తోటివాళ్లతో షేర్‌ చేసుకోలేం. మనసు కుంగు బాటుకు గురవుతూనే ఉంటుంది. అలాంటి వారికి ఉపశమనం కల్పించేందుకు ఏర్పాటు చేసిందే టెలిమానస్‌… ఇక్కడ మీ గోప్యతకు రక్షణ ఉంటుంది. సమస్యలకు పరి ష్కారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంపై కోల్పోయిన నమ్మకాన్ని మళ్లీ పునరుజ్జీవింపచేస్తుంది.

గోప్యతకు భరోసా..ఇవీ నెంబర్లు
ప్రజల గోప్యతకు భంగం కలగకుండా
సేవలందించేందుకు టెలిమానస్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని పలువురు నిపుణులు చేసిన సూచన మూడేండ్ల క్రితం కార్యరూపం దాల్చింది. రోజుకు 24 గంటలు పని చేసేలా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన టెలిమానస్‌ హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశారు. ఫోన్‌ నెంబర్లు 21441645/ 1800-891-4416. మూడేండ్లలో ఈ సేవలను 21 లక్షల మంది వినియోగించుకున్నారు.

15 శాతం మానసిక రోగాలే..
మనిషిని సతమతం చేస్తున్న రోగాల్లో 15 శాతం మానసిక రోగాలే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. 1993 నాటికి 6 నుంచి 7 శాతానికి పరిమితమైన మానసిక రోగాలు 2020 నాటికే గణనీయంగా పెరిగినట్టు గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటేటా పెరుగుతున్న మానసిక రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆయా దేశాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించింది. దీంతో భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక విధానాన్ని రూపొందించుకునేందుకు పాలసీ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్‌ 2013లో ప్రభుత్వానికి పలు సిఫారసులు చేసింది.

తెలుగులోనూ సేవలు
దేశవ్యాప్తంగా 53 సెంటర్ల ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ (నిమ్హాన్స్‌) ఈ హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తున్నది. బెంగుళూరు త్రిబుల్‌ ఐటీ సాంకేతిక సహకారాన్ని అందిస్తున్నది. తెలుగుతో పాటు మొత్తం 20 భాషల్లో ఈ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి వైద్య నిపుణుల సలహాలను ఉచితంగా తీసుకునేందుకు వీలు కల్పించింది. 2022 అక్టోబర్‌ 10న హెల్ప్‌లైన్‌ ప్రారంభం కాగా 2023 ఏప్రిల్‌ నాటికి ఒక లక్ష కాల్స్‌ దాటాయి. అదే ఏడాది డిసెంబర్‌ నాటికి 11.5 లక్షల కాల్స్‌ ను స్వీకరించారు. 2024 మే నాటికి 10 లక్షలు, ఏప్రిల్‌ నాటికి 15 లక్షలు కాల్స్‌ రాగా, ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 20 లక్షలు దాటాయి.

ఫోన్‌ చేయండి : అర్చన కార్తీక్‌, టెలిమానస్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌
మానసిక ఒత్తిడితో ఉన్నవారు టెలిమానస్‌కు ఫోన్‌ చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని టెలిమానస్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బెంగుళూరు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అర్చన కార్తీక్‌ సూచించారు. డిప్రెషన్‌, కుటుంబ సమస్యలు, చదువులో ఒత్తిడి, ఆత్మహత్యల గురించిన ఆలోచనలు, మాదకద్రవ్యాలకు వ్యసనపరులుగా మారినవారు, జ్ఞానపశక్తి సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, నిద్రలేమి, పరీక్షల ఒత్తిడితో బాధపడుతున్న వారు ..ఇలా అనేక రకాలుగా మానసిక ఒత్తిడిలో ఉన్నవారి నుంచి హెల్ప్‌లైన్‌కు ఎక్కువగా కాల్స్‌ వస్తున్నట్టు ఆమె తెలిపారు. సమాజంలో మానసిక వ్యాధుల పట్ల అవగాహన మరింత పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. సమాజంలో వివక్షతో పాటు అవగాహన లేమి కారణంగా మానసిక వైద్యుల వద్దకు వెళ్లడం లేదని చెప్పారు. గోప్యతను కోరుకుంటూ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలనుకునే వారికి టెలిమానస్‌ ఊరటనిస్తుందని తెలిపారు.

వీడియో కన్సల్టేషన్‌ విస్తరణ : ప్రొఫెసర్‌ టి.కె.శ్రీకాంత్‌
మూడేండ్ల ప్రస్థానంలో టెలిమానస్‌ సేవలను మరింత విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించినట్టు బెంగుళూరు త్రిబుల్‌ ఐటీ ఈ-హెల్త్‌ రీసెర్చ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ టి.కె.శ్రీకాంత్‌ తెలిపారు. కాల్స్‌ చేస్తున్న వారిలో మానసిక ఆరోగ్య సమస్యలు ప్రాథమిక స్థాయిలో ఉన్నవారితో పాటు తీవ్రమైన స్థితికి చేరిన వారుంటున్నారు. తీవ్రమైన సమస్యలున్నవారికి వీడియో కన్సల్టేషన్‌ అవసరమని తెలిపారు. వీరి కోసం పైలెట్‌ ప్రాజెక్టుగా కర్ణాటక, తమిళనాడు, జమ్ముకాశ్మీర్‌లో వీడియో కౌన్సిలింగ్‌ సేవలను ప్రారంభించామన్నారు. ఒక్కో కేంద్రంలో ఒక్కో షిఫ్టులో నలుగురు ఉంటారనీ, ఈ సేవలో వైద్యులు, ఎనిమిది మంది కౌన్సెలర్లు సేవలందిస్తారని చెప్పారు.

చికిత్సపై చిన్నచూపు
సమాజంలో వివక్షకు, చిన్నచూపునకు గురవుతామనే భయంతో చాలామంది సకాలంలో మానసిక వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకునేందుకు నిరాకరి స్తుంటారు. సిగ్గు, బిడియంతో ప్రాథమిక దశలో మానసిక ఒత్తిడిని దాచు కోవడంతో రోగ తీవ్రత పెరుగుతుంది.

టెలిమానస్‌..ఆత్మీయతకు భరోసా
టెలిమానస్‌… మానసిక రోగుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌. క్షణికావేశంలో మనసు కఠిన నిర్ణయాలతో ఆధీనం తప్పినప్పుడు, దాన్ని నిరోధిస్తూ, అవసర మైన మానసిక స్థైర్యాన్ని, బతుకుపై భరోసాను కల్పించే టెలిఫోన్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌. మారిన జీవనశైలి, వేగవంతమైన జీవితం, ఆర్థిక స్థితిగతులు, పెరుగుతున్న కోరికలు, స్వార్థం, మానవ సంబంధాల విచ్ఛిన్నం, మనోవికారం వంటి రుగ్మతలు శారీరక ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తూ, మానవ వనరులను నిర్వీర్యం చేస్తున్నాయి. పైకి సంపూర్ణ ఆరోగ్యంగా కనిపించే వారు సైతం మానసిక రోగులుగా మారుతూ చికిత్స కోసం ఎదురు చూస్తుంటారు.

రిస్క్‌ గ్రూప్‌
పేదరికం, సామాజికంగా, ఆర్థికంగా వెనుక బాటు, శారీరక వికలాంగులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పిల్లలు, మహిళలు, అనాథలు, ప్రకృతి, మానవ తప్పిదాల ప్రమాదాల బాధితులు, మానవ అక్రమ రవాణాకు గురైన వారితో పాటు జీవనోపాధి కోసం ఉన్నపళంగా తప్పనిసరై వలసలు వెళ్లే వారిని రిస్క్‌ గ్రూప్‌గా గుర్తించారు. వారి మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -