ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యు.ఎన్.ఇ.పి.) నేతృత్వంలో 1973 నుండి ప్రతిఏడాది జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించ బడుతోంది. 2025 సంవ త్సర ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఇతివృతం (ధీమ్) ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి (బీట్ప్లాస్టిక్ పొల్యూషన్). 2025లో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడంపై దృష్టి పెట్టింది. ఏడాదికోసారి 150కి పైగా దేశాలు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొంటు న్నాయి. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కొరియా రిపబ్లిక్ నిర్వహిస్తున్నది.ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఓడించండి ఇతివఅతం (ధీమ్) ఎంచుకోవడానికి గల కారణము వాతావరణ మార్పు, ప్రకృతి, జీవవైవిధ్య నష్టం, కాలుష్యం, వ్యర్థాలు అనే భూగ్రహ సంక్షోభాలను ప్లాస్టిక్ కాలుష్యం తీవ్రతరము చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా, ప్రతి సంవత్సరం పదకొండు మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉపరితల నీటి వ్యవస్థల లోనికి వచ్చిచేరుతున్నాయని అని అంచనా వేయబడింది. నీటి ప్రవాహాల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా ప్లాస్టిక్ వ్యర్ధాలు పంటపొల్లాలో వచ్చిచేరి అవి క్రమేపి మైక్రోప్లాస్టిక్స్ రూపంలోకి మారి పంటపొలాలను నిస్సత్తువగా చేయటము కాక వర్షపునీరు భూమిలోపలికి ప్రవేశించకుండా అడ్డుకోవటం వలన భూగర్భ జలాలు రీఛార్జ్ కావటం లేదు. ఈ విధంగా ప్లాస్టిక్ కాలుష్యంవలన సంవత్సరానికయ్యే సామాజిక, పర్యావరణకాలుష్య వ్యయం యుఎస్ డాలర్ 300 బిలియన్ల నుండి 600 బిలియన్ల మధ్య ఉంటుంది. గతసంవత్సరం ప్రపంచం 400 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసిందని అంచనా.
ప్రపంచం ఏటా 430 మిలియన్ టన్నులకు పైగా ప్లాస్టిక్ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో మూడింట రెండు వంతుల ప్లాస్టిక్ స్వల్ప కాలానికి పనికి వచ్చే సింగల్ యూజ్ ప్లాస్టిక్ (ఒక్కసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్). ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ ఉత్పత్తులు ప్రజల దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారాయి. వీటివలన ఎక్కువ మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలు ఏర్పడు తాయి. పర్యావరణంలోకిి విడుద లైన ప్లాస్టిక్ వ్యర్ధాలు ఆహార గొలుసు ద్వారా మొక్కల్లోకి, చేపల్లోకి, జంతువుల్లోకి, మనుషుల్లోకి ప్రవేశిస్తాయి. ఒక అధ్యయనంలో చిన్న ప్లాస్టిక్ కణాలు ఫైటోప్లాంక్టన్ అని పిలువబడే సూక్ష్మ సముద్ర ఆల్గే పెరుగుదలను నెమ్మదిస్తాయని తేలింది. ఇది అనేక జల ఆహార చక్రాలకు(అక్వాటిక్ ఫుడ్ వెబ్) ఆధారం.అలాగే చేపలు, ఇతర సముద్ర నీటిలోని జీవులు తరచూ పొరపాటుగా ప్లాస్టిక్ పదార్ధాలను తిని చనిపోతాయి.ఈ విధంగా సముద్రంలోని జీవులు అంతరించిపోయే ప్రమాదం ఉన్నది.ప్లాస్టిక్ తరచుగా చిన్న ముక్కలుగా విచ్ఛిన్నమవుతుంది. దీన్ని మైక్రోప్లాస్టిక్స్(సుమారు ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణం) నానోప్లాస్టిక్స్ అని పిలుస్తారు. ఇవి మానవ శరీరంలో పేరుకుపోతాయి. కాలేయము, వృషణాల్లో, తల్లి పాలల్లో కూడా మైక్రోప్లాస్టిక్లు కనుగొనబడ్డాయి.
సగటున ఒక లీటరు బాటిల్ వాటర్లో 2,40,000 మైక్రోప్లాస్టిక్లు ఉంటాయని ఒక అధ్యయనం ద్వారా తెలియ వచ్చింది. ప్లాస్టిక్ పదార్థాల తయారీకి వాడపడే ముడి పదార్థాలు గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే పెట్రోలియం ఉత్పన్నాలు. ప్లాస్టిక్తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సంగ్రహణ నుండి ప్లాస్టిక్ను పారవేసే వరకు దాని జీవిత చక్రం అంతనూ వాతావరణ మార్పులకు దోహదం చేస్తుంది. 2020లో భూగ్రహం వేడెక్కడానికి కారణమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాల్లో మూడు శాతానికి పైగా ప్లాస్టిక్ నుండి వెలువడినవే. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అధ్యయనం ప్రకారం, కేవలం తొమ్మిది శాతం ప్లాస్టిక్లు మాత్రమే వాస్తవానికి రీసైకిల్ చేయబడుతున్నాయి. 2000-19 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ ఉత్పత్తి రెట్టింపైంది. 2060 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు సంవత్సరానికి దాదాపు మూడురెట్లు పెరిగి ఒక బిలియన్ టన్నులకు చేరుకుం టాయని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంచనా వేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, ఇది ప్లాస్టిక్ కాలుష్యం పెరుగుదలకు దారితీస్తుంది. కొత్తగా ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు సగం భూమిలో పారవేయ బడతాయి, దహనం చేయబడతాయి లేదా పర్యావరణంలోకి విడుదల కాబడుతాయి.
సింగిల్-యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై మనము ఆధారపడటాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉపయోగిం చుకునేలా, తక్కువ ప్రమాదకర మైనవిగా, తిరిగి ఉపయోగించు కునేలా, చివరికి రీసైకిల్ చేసేలా రూపకల్పన చేయడం చేయాలి.అలాగే సమస్యాత్మ కమైన, అనవసరమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, పునర్ వినియోగం, రీసైకిల్ చేయడం, పున్ణస్థాపన, వైవిధ్యపరచడం, వృత్తాకార ఆర్ధిక వ్యవస్థను అవలంభించటం ద్వారాప్రపంచం ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించగలము. పున:దిశానిర్దేశం, వైవిధ్యం అంటే మార్కెట్ను స్థిరమైన (సస్టైనబుల్ )ప్రత్యామ్నాయాల వైపు మళ్లించడం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ(సర్కులర్ ఎకానమీ) అనేది ఉత్పత్తి, వినియోగం నమూనా. దీనిలో వీలైనంత కాలం తయారు అయిన వస్తువులను,ఉత్పత్తులను పంచుకోవడం, లీజుకు ఇవ్వడం, తిరిగి ఉపయోగిం చడం,మరమ్మతు చేయడం, పునరుద్ధరించడం, రీసైక్లింగ్ చేయడం వంటివి ఉంటాయి. తద్వారా వస్తువుల, ఉత్పత్తుల జీవిత చక్రం పొడిగించ బడుతుంది. ఈ విధంగా సర్కులర్ ఎకానమీ ప్లాస్టిక్ వ్యర్ధాలను, ఇతర రకాల వ్యర్ధాలను కనిష్ట స్థాయికి తగ్గిస్తుంది.
పెట్రోలు ఉత్పన్నాలతో తయారు చేసిన ప్లాస్టిక్ బదులుగా పర్యావరణ అనుకూల బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వినియోగాన్ని పెంచాలి. మొక్కజొన్న, చెరకు, సెల్యులోజ్, స్టార్చ్, ఇతర మొక్కల నుండి బ్యాక్టీరియావంటి సూక్ష్మజీవుల నుండి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను తయారు చేస్తారు. పర్యావరణానికి, భూగ్రహానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్న పాస్టిక్ ఉత్పన్నాలను ప్రభుత్వాలు నిషేధించాలి. అదే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్, వాటి ఉత్పనాలను వినియోగించకూడదు, తగ్గిస్తూ ఉండాలి. ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయాలను వాడుకోవాలి. అప్పుడే భూగ్రహాన్ని పర్యావరణాన్ని ప్లాస్టిక్ కాలుష్యము నుంచి రక్షించుకోగలము.
డా|| శ్రీధరాల రాము
9441184667
ప్లాస్టిక్ విషవలయంలో జీవకోటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES