అఖిలభారత ఐక్య రైతు సంఘం తొర్రూరు డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు: భారత రైతంగానికి పంటకు గిట్టుబాటు ఇవ్వకుండా రైతాంగాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మోసం చేస్తున్నారని అఖిలభారత ఐక్య రైతు సంఘం తొర్రూరు డివిజన్ కార్యదర్శి జక్కుల యాకయ్య అన్నారు. అఖిలభారత ఐక్య రైతు సంఘం మండల ప్రథమ మహాసభ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన యాకయ్య మాట్లాడుతూ.. రైతు పండించిన పంటకు ధర చట్టం తెస్తానని ఇచ్చిన హామీ మరిచిన మోడీ రైతాంగాన్ని మోసం చేస్తున్నారని, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పంటకు మద్దతు ధర రేట్లను చూస్తే ఈ విషయం సులభంగానే అర్థం అవుతుందని అన్నారు. ఢిల్లీలో రైతాంగ పోరాట సందర్భంలో రాతపూర్వకంగా దేశ రైతాంగానికి గిట్టుబాటు ధర చట్టం తీస్తానని ఇచ్చిన హామీ బుట్ట దాఖలు అయిందని అన్నారు. దానిని కనీసం పరిగణలోకి తీసుకోకుండా వరికి క్వింటాలకు రూ.69 మాత్రమే పెంచి ఇతర పంటలకు అరకొరగా పెంచినట్టు ప్రకటించడం పెద్ద కుట్రని ఆయన ఆరోపించారు. దేశంలో అత్యధిక మంది రైతాంగం సాగు చేస్తున్న వరి పంటకి రూ.69 మాత్రమే పెంచి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న హామీ ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు. ఎమ్మెస్ స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం పంట పెట్టుబడి కలుపుకొని మద్దతు ధర నిర్ణయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతాంగం మన్నించే పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ వ్యవస్థను లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరకొర రైతులకు భరోసా ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. వర్షాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతాంగానికి అవసరమగు విత్తనాలు ఎరువులు నాణ్యమైనవి అందుబాటులో ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని వాటిపై నిరంతర నిఘా కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. సాగు కోసం నూతన పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వెంటనే రైతన్న గారికి ఇవ్వాలని ఆయన కోరారు.
ఏకాగ్రీవంగా ఏడుగురితో నూతన మండల కమిటీని.
అధ్యక్షులుగా దొడ్డ కేశవులు ఉపాధ్యక్షులు ఆమందా వెంకన్న, ప్రధాన కార్యదర్శి కావటి రమేష్, సహాయ కార్యదర్శి జక్కుల ఐలయ్య, గుగులోతు రాంజీ, కార్యవర్గ సభ్యులుగా యాకయ్య వెంకన్న ఎన్నికైనారు. ముందుగా ఏఐయుకేస్ జెండాను ఈర్ల వెంకన్న ఆవిష్కరించారు అనంతరం అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాసభ అనంతరం పలు రైతాంగ సమస్యలపై తీర్మానాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో బూర్గుల మోషా, శ్రీను, వీరన్న, రవి తదితరులు పాల్గొన్నారు.