Sunday, June 8, 2025
E-PAPER
Homeజాతీయంమోకరిల్లిన మోడీ!

మోకరిల్లిన మోడీ!

- Advertisement -

– సున్నా టారిఫ్‌లకు భారత్‌ అంగీకారం
– నా వల్లే కాల్పుల విరమణ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
– ఇండియాలో ఐఫోన్ల తయారీపైనా అక్కసు
– యూఎస్‌తో సంక్లిష్ట చర్చలు : విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ:
వాణిజ్య విధానంలో అమెరికాకు భారత్‌ మోకరిల్లినట్టు తెలుస్తోంది. అమెరికా ఉత్పత్తులకు ఇకపై భారత్‌లో సుంకాలు ఉండవని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ట్రంప్‌ ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో ఖతార్‌ రాజధాని దోహాలో వ్యాపారవేత్తల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ట్రంప్‌ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు భారతదేశంలో ఏదైనా వస్తువు అమ్మడం చాలా కష్టమమన్నారు. తాజాగా తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే చాలా రకాల వస్తువులపై భారత్‌ జీరో టారిఫ్‌లను ఆఫర్‌ చేసిందని చెప్పారు. దీనికి సంబంధించి అమెరికాకు భారత్‌ ఓ ఒప్పంద ప్రతిపాదన ఆఫర్‌ చేసిందన్నారు. అది జీరో సుంకాలకు సంబంధించిందని ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్‌లో ఆపిల్‌ కంపెనీ కార్యకలాపాల విస్తరణపై కూడా ట్రంప్‌ అక్కసును వ్యక్తం చేశారు. ఇండియాలో ఐఫోన్ల తయారీ సామర్థ్యాన్ని పెంచకూడదని ఆ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ను ఆదేశించారు. మరోవైపు తాను చెబితేనే భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్‌ పునరుద్గాటించారు. కాల్పులు నిలిపివేయకుంటే రెండు దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని హెచ్చరించామన్నారు. దీంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని చెప్పారు.
సంక్లిష్ట చర్చలు : జైశంకర్‌
ట్రంప్‌ తాజా ప్రకటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ స్పందించారు. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయ న్నారు. అవి సంక్లిష్ట చర్చలన్నారు. ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునేవరకు అవి కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. వాణిజ్య ఒప్పందం పరస్పరం ప్రయోజనకరం గా ఉండాలన్నారు. అది జరిగేవరకు దాని గురించి ప్రకటన చేయడం తొందరపాటే అవుతుందని జైశంకర్‌ అన్నారు. అయితే.. ట్రంప్‌ జీరో టారిఫ్‌ వ్యాఖ్యలను మాత్రం ఆయన ఖండించకపోవడం గమనార్హం.
పెట్టుబడులకు విఘాతం..
”నాకు టిమ్‌ కుక్‌తో నిన్న చిన్న సమస్య ఎదురైంది. అతడు భారత్‌లో తయారీ యూనిట్ల విస్తరణను చేపట్టారు. అలా చేయడం నాకు ఇష్టం లేదని చెప్పాను. ఫలితంగా అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు ఆపిల్‌ అంగీకరించింది” అని ట్రంప్‌ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్‌ భారతదేశంలో తన తయారీ సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల యుఎస్‌, చైనా మధ్య నెలకొన్న టారిఫ్‌ యుద్ధంతో ఇండియాలో తన కార్యకలాపాలను పెంచాలని నిర్ణయించినట్లు టిమ్‌ కుక్‌ ఇటీవ లెతలిపారు. భారత్‌లో ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. కాగా.. తాజాగా ట్రంప్‌ వ్యాఖ్యలతో ఆపిల్‌ కంపెనీ భారత్‌లో పెట్టుబడులను నిలిపివేయనుందని స్పష్టమవుతోంది. ఇది ఎలక్ట్రానిక్స్‌లో రంగంలో మరిన్ని విదేశీ పెట్టుబడులకు విఘాతం కల్పించనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజా పరిణామాలతో ట్రంప్‌ విధానాలకు మోడీ దాసోహం వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాపై యూఎస్‌ విచ్చలవిడిగా సుంకాలు విధించినప్పుడు పొరుగు దేశం అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అంతే ధీటుగా అమెరికా ఉత్పత్తులపై సుంకాలు, ఆంక్షలు విధించడం ద్వారా తుదకు తన దారికి తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ భారత్‌పై అమెరికా ఆంక్షలు, షరతులపై ప్రధాని మోడీ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడకపోవడం ఆందోళనకర అంశం.
నేడు వాషింగ్టన్‌కు భారత బృందం
అమెరికాతో వాణిజ్య చర్చలు జరపడానికి భారత్‌ సన్నద్దమవుతోన్న వేళ ట్రంప్‌ వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తున్నాయని స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య నాలుగు రోజులపాటు ఈ వాణిజ్య చర్చల కోసం ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు అయ్యింది. భారత ఉన్నతాధికారుల బృందం 16న(శుక్రవారం) వాషింగ్టన్‌కు చేరుకోనుంది. 17 (శనివారం) నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ చర్చలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్‌ గోయల్‌ నాయకత్వం వహించనున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌తో, వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్‌ లూట్నిక్‌తో చర్చలు జరపనున్నారు. ట్రంప్‌ చెప్పిన విధంగా భారత్‌ జీరో టారిప్‌లకు అంగీకరిస్తే.. అమెరికా ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ఆక్రమించనున్నాయి. ఇక్కడి అనేక రంగాల కంపెనీలు మూత పడే ప్రమాదం ఉంది. దీంతో ఉపాధి కల్పన, ప్రజల ఆదాయాలు దెబ్బతిననున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -