బీజేపీ,ఈసీ కుమ్మక్కై ఓట్లు దొంగిలించాయి : రాహుల్ గాంధీ
పాట్నా: ‘ఓట్ చోర్- గద్దీ ఛోడ్’ అనే నినాదంతో ‘ఓటర్ అధికార్ యాత్ర’ చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ బీజేపీ, ఎన్నికల సంఘంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తమ ఓట్లను దొంగిలిస్తే బీహార్ ప్రజలు సహించబోరన్నారు. ఓటర్ల జాబితా నుంచి రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆక్షేపించారు.
అందులో ఎక్కువమంది బడుగు బలహీనవర్గాల వారే ఉన్నారని అన్నారు.సీతామఢలోీ నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్రలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ‘ఓట్ చోరీ’ గురించి రానున్న రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపెడతానని అన్నారు. ”ఎన్నికల సంఘం, బీజేపీ కుమ్మక్కై ఓట్లను దొంగిలించాయి. గతంలో మహారాష్ట్ర, హర్యానా, కర్నాటకలో ఇదే పంథా కొనసాగించారు. ఇప్పుడు బీహార్ వంతు వచ్చింది. కానీ, ఇక్కడి ప్రజలు దీన్ని సహించరు.” అని అన్నారు. యాత్రలో భాగంగా స్థానిక సీతాదేవి ఆలయాన్ని రాహుల్ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ విమర్శించారు. ప్రధానమంత్రి కూడా ఓట్ల తస్కరణకు పాల్పడ్డారని ఆరోపించారు. కొందరు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఘాటు విమర్శలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 17న ప్రారంభమైన యాత్ర.. 16 రోజుల పాటు 1,300కి.మీ మేర సాగనుంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది.