Friday, December 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరక్షణ బిల్లులో చైనాపై మరిన్ని ఆంక్షలు

రక్షణ బిల్లులో చైనాపై మరిన్ని ఆంక్షలు

- Advertisement -

అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం
వాషింగ్టన్‌ :
రక్షణ బిల్లులో చైనాపై మరిన్ని ఆంక్షలు విధించేందు కు అమెరికా ప్రతినిధి సభ ఆమోదం తెలిపింది. అత్యంత కీలకమైన రంగాలలో చైనా పెట్టుబడులను ఈ బిల్లు నిరాకరిస్తోంది. చైనాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీలపై అమెరికా ఆధారపడడాన్న తగ్గిస్తోంది. చైనా సైనిక శక్తిని బలోపేతం చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన అమెరికా పెట్టుబడులను తనిఖీ చేసే నిబంధనను కూడా బిల్లులో చేర్చారు. మూడు వేల పేజీలతో కూడిన ఈ బిల్లును అమెరికా కాంగ్రెస్‌ బుధవారం ఆమోదించింది. ఇప్పుడది సెనెట్‌ ముందుకు వెళ్లనుంది. బ్లాక్‌లిస్టులో పెట్టిన చైనా బయోటెక్నాలజీ కంపెనీల నుంచి సేవలు, పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వ సొమ్మును వినియోగించడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది. అంతేకాక తైవాన్‌కు భద్రతా పరమైన సహకారం కోసం కాంగ్రెస్‌ ఆమోదించిన రక్షణ బిల్లు ఈ సంవత్సరం కేటాయింపులను బిలియన్‌ డాలర్ల నుంచి 300 మిలియన్‌ డాలర్లకు పెంచింది. తైవాన్‌లో సంయుక్త డ్రోన్‌, యాంటీ-డ్రోన్‌ కార్యక్రమం చేపట్టడానికి రక్షణ శాఖకు అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో చేరడానికి తైవాన్‌ చేస్తున్న ప్రయత్నాలకు కూడా బిల్లులోని నిబంధనలు మద్దతు ఇచ్చాయి. ఇదిలా వుండగా తైవాన్‌కు మరింత మద్దతు అందించేందుకు అమెరికా నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ చట్టం వీలు కల్పిస్తోంది. చైనా కమ్యూనిస్టు పార్టీని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న తీవ్రమైన, వ్యూహాత్మక వైఖరికి ఈ చర్యలు అద్దం పడుతున్నాయని హౌస్‌ సెలక్ట్‌ కమిటీలోని డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు రాజా కృష్ణమూర్తి చెప్పారు. అమెరికా అధ్యక్ష భవనం ఇటీవలి కాలంలో చైనా విషయంలో కొంత మెతక వైఖరి ప్రదర్శిస్తోంది. చైనాతో అమెరికా ఆర్థిక సంబంధాలను తిరిగి సమతుల్యం చేసుకుంటామని ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల చెప్పింది. చైనాకు అత్యాధునిక కంప్యూటర్‌ చిప్‌ను విక్రయించేందుకు అధ్యక్ష భవనం ఈ వారంలోనే న్విడియా కంపెనీని అనుమతించింది. అయితే అమెరికా ప్రతినిధి సభ మాత్రం చైనా పట్ల కఠినంగా వ్యవహరించడం గమనార్హం.

మండిపడిన చైనా
కాంగ్రెస్‌ ఆమోదించిన బిల్లును వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం తప్పుపట్టింది. ‘చైనా ముప్పుపై పదే పదే అసత్య కథనాలను ప్రచారం చేస్తూ తైవాన్‌కు సైనిక మద్దతు ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది. చైనా ఆర్థికాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ద్వైపాక్షిక వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పరిమితం చేస్తున్నారు. ఇది చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరీకరించడానికి ఇరు పక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తోంది’ అని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియు పెంగ్యూ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -