Tuesday, June 3, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకడదాక కమ్యూనిస్టుగా'తాయారమ్మ'

కడదాక కమ్యూనిస్టుగా’తాయారమ్మ’

- Advertisement -

– మహిళా సంఘంలో నిబద్ధతతో పనిచేశారు
– ఆమెతో పాటు కుటుంబమంతా పార్టీకి అంకితమవ్వడం అందరికీ ఆదర్శం : సంస్మరణ సభలో వక్తలు
నవతెలంగాణ-సిటీబ్యూరో

సామాన్య మహిళగా ఉంటూ చనిపోయేదాకా కమ్యూనిస్టుగా జీవించిన ‘కేఏఎం తాయారమ్మ’ అందరికీ ఆదర్శమని వక్తలు రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌ బాగ్‌లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేఏఎం తాయారమ్మ సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సీపీఐ(ఎం) ముఖ్యనేతలు, నాయకులు నివాళులర్పించారు. పార్టీ జిల్లా నాయకులు వి. కామేష్‌ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో మధు మాట్లాడుతూ.. తాయారమ్మ.. కడదాక కమ్యూనిస్టు విలువలు, సిద్దాంతంతో జీవించారన్నారు. తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వడంతో మృతిచెందారన్నారు. ప్రపంచంలో, దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం బాగా దెబ్బతింటోందని, ఈ సందర్భంలో ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని.. తాయారమ్మ ఏ రకంగానైతే తన ఆశయాన్ని సాధించడం కోసం పట్టుదలతో కృషి చేస్తూ వచ్చారో.. ఆ పట్టుదలను మనమంతా ప్రదర్శించాల్సిన అవసరముందన్నారు. అమెరికాలో ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ.. అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగంలో 2.5లక్షల ఉద్యోగులను తొలగించారనీ, పన్నులు, విద్యా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారన్నారు. మరోవైపు మోడీ సర్కారు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. వారి అంతుచూస్తామని ప్రకటిస్తే.. అన్ని వర్గాల ప్రజలు, పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తుచేశారు. కానీ ఒక్కసారిగా సీజ్‌ ఫైర్‌ ప్రకటించడంపై అంతా విస్మయం వ్యక్తం చేశారన్నారు. పహల్గాం దాడి, అనంతర పరిణామాలపై పార్లమెంట్‌ సమావేశాలు పెట్టాలని కోరుతుంటే.. ఆ సభ్యులను విదేశాలకు తిప్పుతున్నారని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయనీ, దీనికనుగుణంగా మనమంతా కుటుంబాలతో సహా నిలబడి ఉద్యమంలో పాల్గొనటం ద్వారా తాయారమ్మకు సరైన నివాళులర్పించడమవుతుందన్నారు. పెనన్షర్ల సంఘం జాతీయ నాయకులు ఎంఎన్‌ రెడ్డి మాట్లాడుతూ.. పోస్టల్‌ ఉద్యమంలో తాయారమ్మ భర్త ముత్యాలుతో కలిసి దాదాపు 5 దశాబ్దాలు పనిచేశానన్నారు. కలిసి పనిచేసే చోట కుటుంబం, పిల్లలు గురించి పట్టించుకోలేదన్నారు. అయినప్పటికీ తాయారమ్మ పార్టీకి, మహిళా ఉద్యమానికి అంకితమై పనిచేయడం ఆదర్శనీయమన్నారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. తాయారమ్మ జీవిత చరమాంకం వరకు కమ్యూనిస్టుగా బతికారన్నారు. సమాజంలో మార్పు కోసం ఎవరో ఒకరు పనిచేస్తేనే కష్టమనుకుంటున్న తరుణంలో తన కుటుంబమంతా కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేయడం గొప్ప విషయమన్నారు. తాయారమ్మ మరణించిన తర్వాత మృతదేహాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీకి ఇచ్చి ఆదర్శంగా నిలిచారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్పొరేట్‌ సంస్థలకు, ఫ్యూడల్‌ భావాలు, కులవ్యవస్థకు అనుకూలంగా, మతోన్మాద రాజకీయాలు పెంచి పోషిస్తున్నదని తెలిపారు. దేశంలో ఒక్క శాతం ఉన్న కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో 40 శాతం సంపద ఉంటే.. 50 శాతంగా ఉండే అట్టడుగువర్గాల ప్రజల చేతుల్లో 3 శాతమే సంపద ఉందన్నారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట అటవీ సంపదను కార్పొరేట్లకు అప్పగించేందుకు మావోయిస్టులను, అమాయక ఆదివాసీలను చంపుతున్నారన్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి మాట్లాడుతూ.. ప్రజా, మహిళా సంఘంలో నిబద్ధతతో తాయారమ్మ పనిచేశారన్నారు. సామాన్య స్త్రీగా భర్తకి చేదోడుగా ఉంటూ ప్రజా సంఘం, పార్టీలో పనిచేసే కార్యకర్తలందరికీ నిరంతరం భోజనాలు, తదితర సౌకర్యాలు కల్పిస్తూ మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. పార్టీ నాయకురాలు హేమలత ప్రోత్సాహంతో ఏపీలోని బందర్‌లో ప్రారంభమైన తాయారమ్మ ప్రజా ప్రస్థానం.. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూడా కొనసాగించిందన్నారు. చివరికి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తన మృతదేహాన్ని గాంధీ మెడికల్‌ కాలేజీకి డొనేట్‌ చేయాలని కుటుంబ సభ్యులను కోరటం.. మనందరికీ ఆదర్శమన్నారు.
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. త్యాగాలకు సమాజం పట్ల సరైన అవగాహనకు నాయకులు కావాల్సిన అవసరం లేదని, ఎవరైనా చేయొచ్చని తాయారమ్మ చేసి చూపించారన్నారు. తాయారమ్మ కుటుంబం మొత్తం ప్రజా ఉద్యమంతో మమేకం కావటం చిన్న విషయం కాదన్నారు. అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డీజీ నరసింహారావు, పార్టీ హైదరాబాద్‌ జిల్లా మాజీ కార్యదర్శి పీఎస్‌ఎన్‌ మూర్తి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) హైదరాబాద్‌ జిల్లా మాజీ కార్యదర్శులు ఎం.శ్రీనివాస్‌, ఎస్వీకే కార్యదర్శి వినయ కుమార్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగలక్ష్మి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌ రావు, వివిధ రంగాల నాయకులు, కార్యకర్తలు, తాయారమ్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -