ఉచిత మోకాలు చిప్ప ఆపరేషన్లు అభినందనీయం : ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు
ఆయన స్ఫూర్తి కొనసాగించేందుకే సేవా కార్యక్రమాలు : డాక్టర్ మల్లు అరుణ్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండటౌన్
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సీపీఐ(ఎం) మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లు వెంకట నరసింహారెడ్డి జీవితం అందరికీ ఆదర్శనీయమని మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు అన్నారు. ఆయన అందించిన పోరాట స్ఫూర్తిని, మానవతా విలువల ను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మల్లు వెంకట నరసింహారెడ్డి 24వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్లగొండలోని సత్యావతి ఆస్పత్రిలో ఎంవీఎన్ మనవడు, ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లు అరుణ్రెడ్డి ఆధ్వర్యంలో 94 సంవత్సరాల వృద్ధుడికి ఉచిత మోకాలు చిప్ప మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఎన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఎంవీఎన్ జీవితమంతా త్యాగాలమయమని, జీవితాంతం నిరుపేదల అభ్యున్నతి కోసం పరితపించారని గుర్తు చేశారు. ప్రతి ఏడాదీ ఆయన వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఉచిత మోకాలు మార్పిడి ఆపరేషన్ అభినయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కోరారు.
ఆర్థోపెడిక్ వైద్యులు మల్లు అరుణ్రెడ్డి మాట్లాడుతూ.. ఎంవీఎన్ తన జీవితాంతం అట్టడుగు వర్గాల కోసం పని చేశారన్నారు. గొప్ప వ్యక్తుల స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయేందుకు ఇలాంటి కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్ లోనూ మరింత ముందుకు తీసుకుపోతామని, ఇందుకు సంపూర్ణ సహకారం అందిస్తున్న సత్యవతి ఆస్పత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్పత్రి ఎండి డాక్టర్ రాం మనోహర్ మాట్లాడుతూ.. మల్లు వెంకట నరసింహారెడ్డి స్ఫూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోష కరమన్నారు. అందులో తమ ఆస్పత్రి భాగస్వామ్యం కావడం ఇంకా సంతోషంగా ఉన్నదన్నారు. తాము కూడా అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని చెప్పారు. ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి మాట్లా డుతూ.. విజ్ఞానకేంద్రం ఆధ్వర్యంలో ప్రతినెలా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ అరుణ్కు, సత్యవతి ఆస్పత్రి యాజమాన్యానికి ఎంవీఎన్ విజ్ఞానకేంద్రం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య సేవలు కాకుండా విద్యార్థులకు కరాటే, ఉచిత కంప్యూటర్ శిక్షణ, మహిళలకు టైలరింగ్, క్రీడా పోటీలు నిర్వహిస్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షులు డాక్టర్ రమేష్, మాజీ అధ్యక్షులు డాక్టర్ అనితారాణి, డాక్టర్ చైతన్య, డాక్టర్ సంపద, సత్యవతి వైద్యశాల ఎండి సత్యనారాయణ, కంప్యూటర్ శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ శంకర్ పాల్గొన్నారు.



