నవతెలంగాణ – హైదరాబాద్: లేడీ సూపర్ స్టార్ నయనతార జీవితంపై తెరకెక్కిన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్’ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఓ కాపీరైట్ వివాదం ఎదుర్కొంటున్న ఈ డాక్యుమెంటరీపై తాజాగా మరో భారీ దావా నమోదైంది. సూపర్ హిట్ చిత్రం ‘చంద్రముఖి’కి సంబంధించిన ఫుటేజీని తమ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆరోపిస్తూ ఏపీ ఇంటర్నేషనల్ అనే సంస్థ డాక్యుమెంటరీ నిర్మాతలపై, ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్పై రూ. 5 కోట్ల దావా వేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన మద్రాస్ హైకోర్టు, డాక్యుమెంటరీ నిర్మాతలైన టార్క్ స్టూడియో ఎల్ఎల్పీకి, నెట్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ సర్వీసెస్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.
‘చంద్రముఖి’ సినిమా ఆడియో, వీడియో హక్కులు తమ వద్దే ఉన్నాయని, యూట్యూబ్ నుంచి సేకరించిన క్లిప్స్ను తమ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఏపీ ఇంటర్నేషనల్ తన పిటిషన్లో ఆరోపించింది. ఈ విషయంపై తాము మొదట లీగల్ నోటీసు పంపగా, ఆ తర్వాతే నిర్మాతలు తమను లైసెన్స్ కోసం సంప్రదించారని సంస్థ తెలిపింది. తమ సినిమా క్లిప్స్ను డాక్యుమెంటరీ నుంచి తక్షణమే తొలగించాలని, రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.