నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల బీహార్ అసెంబ్లీ ముగిసిన విషయం తెలిసిందే. ఎన్డేయే కూటమి భారీ విజయం సాధించింది. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు.. నూతన సర్కారు నుంచి బంపర్ బహుమతి అందుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన 243 మంది ఎమ్మెల్యేల కోసం పట్నాలోని దరోగా రాయ్ పాత్లో నిర్మించిన 181 అధునాతన డ్యూప్లెక్స్ల నిర్మాణం పూర్తయ్యింది. అంతకుముందు ఉన్న 62 బంగ్లాలకు అదనంగా నిర్మించిన ఈ నివాసాలు మొత్తం 44 ఎకరాల క్యాంపస్లో విస్తరించి ఉన్నాయి. ఈ నూతన భవనాలను చూసినవారంతా ఇవి ‘ఇళ్లా.. ఇంద్ర భవనాలా?’అని అంటున్నారు.
ప్రతి యూనిట్ సుమారు 3,693–3,700 చదరపు అడుగుల విస్తీర్ణంతో 4BHK ఫార్మాట్లో ఈ ఇళ్లను నిర్మించారు. వాటిలో విలాసవంతమైన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రతి డ్యూప్లెక్స్ లేఅవుట్ ఎంతో ప్లానింగ్తో కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎమ్మెల్యేలకు అవసరమైన గెస్ట్ రూమ్, పీఏ రూమ్, ఆఫీస్ రూమ్,కిచెన్ ఉన్నాయి. మొదటి అంతస్తులో మాస్టర్ బెడ్రూమ్తో సహా మూడు గదులు, మొత్తం ఆరు టాయిలెట్లు ఉన్నాయి. అన్ని గదులలో ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే హాస్టల్, క్యాంటీన్, కమ్యూనిటీ సెంటర్ తదితర అదనపు సౌకర్యాలను క్యాంపస్లో ఏర్పాటు చేశారు.



