బీహార్ ముఖ్యమంత్రిగా పదోసారి..
పాట్నా : ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. నవంబర్ 19 లేదా 20 తేదీలలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ప్రమాణస్వీకారానికి 19 లేదా 20లలో ఏ తేదీని నిర్ణయిస్తారనే విషయం ప్రధాని మోడీ షెడ్యూల్పై ఆధారపడి ఉంటుందని తెలిపాయి. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం గాంధీ మైదానంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ఆదివారం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు సమర్పించింది. సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు ఆమోదం తెలిపే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత నీతీశ్ తన రాజీనామాను గవర్నర్కు సమర్పిస్తారు. తద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమవుతాయి.
మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం
కొత్త ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పునకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే గత శనివారం కేంద్రమంత్రి అమిత్షాతో కూటమి నేతలు భేటీ అయ్యారు. ఈ దఫా క్యాబినెట్లో బీజేపీకి ఎక్కువ బెర్తులు దక్కే వీలుంది. తర్వాతి స్థానంలో జేడీయూ ఇతర పార్టీలు ఉన్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వా న్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్)కి 3 మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు సమాచారం.



