Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం34 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగల్‌

34 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగల్‌

- Advertisement -

4,090 ఎంబీబీఎస్‌ సీట్లు యధాతథం
రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు ప్రశంసలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో 4,090 ఎంబీబీఎస్‌ సీట్లు ఈ ఏడాది కూడా కొనసాగనున్నాయి. మెడికల్‌ కాలేజీల తనిఖీ సందర్భంగా బోధనా సిబ్బంది కొరతను గుర్తించిన ఎన్‌ఎంసీ ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. ఇటీవల ఫ్యాకల్టీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం టీచింగ్‌ ఫ్యాకల్టీకి పెద్ద సంఖ్యలో పదోన్నతులు కల్పించింది. 44 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు, అడిషనల్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్లుగా ప్రమోషన్లు ఇస్తూ వారందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌గా, టీచింగ్‌ హాస్పిటళ్లకు సూపరింటెండెంట్లుగా నియమించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న 278 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ ప్రమోషన్లతో అన్ని కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత, డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీల సమస్య తీరనున్నది.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న సుమారు 231 మందికి అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు ఇచ్చేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌, అడిషనల్‌ డీఎంఈ వంటి పోస్టులను నేరుగా రిక్రూట్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రమోషన్ల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇవిగాక సుమారు మరో 714 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ అంశాలన్నీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. దీనికి ఎన్‌ఎంసీ సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని టీచింగ్‌ హాస్పిటళ్లలో బెడ్ల సంఖ్య తక్కువగా ఉందని ఎన్‌ఎంసీ గుర్తించగా, 21 టీచింగ్‌ హాస్పిటల్స్‌లో కలిపి సుమారు 6 వేలకుపైగా బెడ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి కాలేజీ పర్యవేక్షణకు మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీ(ఎంసీఎంసీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలు అన్ని కాలేజీల్లో పర్యటించి, కాలేజీల అభివద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో 2022 నుంచి 2024 మధ్యలో ఒకేసారి 25 కాలేజీలు ఏర్పాటైన తీరును అధికారులు ఎన్‌ఎంసీకి వివరించారు. అన్ని కాలేజీలు, వాటి అనుబంధ టీచింగ్‌ హాస్పిటళ్లకు భవనాలను నిర్మిస్తున్న విషయాన్ని తెలియజేశారు. భవన నిర్మాణ పనుల పురోగతిని ఎన్‌ఎంసీ పరిశీలించింది. అన్ని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని.. విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. 4 నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని ఎన్‌ఎంసీ సూచించింది. ఈ మేరకు అన్ని కాలేజీలకూ పర్మిషన్లను యథావిధిగా కొనసాగిస్తున్నట్టు స్పష్టం చేసింది.


త్వరలో నీట్‌ రాష్ట్ర ర్యాంకులు
ఎన్‌ఎంసీ గ్రీన్‌ సిగల్‌ నేపథ్యంలో ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ సిద్ధమవుతోందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే నీట్‌ స్టేట్‌ ర్యాంకులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత, మెడికల్‌ కౌన్సిలింగ్‌ కమిటీ షెడ్యూల్‌ ప్రకారం కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -