నేటి నుంచి ఆసియా కప్
టైటిల్ ఫేవరేట్గా టీమ్ ఇండియా
నవతెలంగాణ-దుబాయ్ :
ఇంగ్లాండ్ పర్యటన తర్వాత విరామం తీసుకున్న భారత క్రికెటర్లు ఇక ఆసియా వేటకు సిద్ధం కానున్నారు. యుఏఈ వేదికగా ఆసియా కప్ నేటి నుంచి ఆరంభం కానుంది. ఎనిమిది జట్లు పోటీపడుతున్న ఈ కాంటినెంటల్ టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్. టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్లో ఆరంభ మ్యాచ్లో నేడు అఫ్గనిస్తాన్, హాంగ్కాంగ్ తలపడతాయి. ఆసియా కప్ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఆరంభం అవుతాయి. సోనీస్పోర్ట్స్ నెట్వర్క్స్లో మ్యాచులు ప్రసారం అవుతాయి.
బీసీసీఐ ఆతిథ్యం
2025 ఆసియా కప్ ఆతిథ్య హక్కులు బీసీసీఐ పొందింది. భారత్, పాకిస్తాన్లు సరిహద్దు, ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు జట్లు తటస్థ వేదికపై మాత్రమే ఆడుతున్నాయి. అందుకే బీసీసీఐ ఆతిథ్యంలో ఆసియా కప్ యుఏఈలో జరుగుతోంది. భారత్లో టోర్నమెంట్ నిర్వహిస్తే.. పాకిస్తాన్ మ్యాచులను తటస్థ వేదికపై నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. షెడ్యూల్, నిర్వహణ పరంగా సమస్యలు తలెత్తకుండా ఆసియా కప్ను యుఏఈలోని దుబారు, అబుదాబిలో నిర్వహిస్తున్నారు.
బరిలో ఎనిమిది జట్లు
1984లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత్ ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఆరుసార్లు శ్రీలంక చాంపియన్గా అవతరించింది. 2023లో వన్డే ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ను భారత్ గెల్చుకుంది. ఈసారి ఆసియా టైటిల్ వేటలో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ సహా యుఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూప్-బిలో అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, హాంగ్కాంగ్ ఆడుతున్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 4కు చేరుకుంటాయి. సూపర్4లో టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా ఫైనల్లో తలపడతాయి.
ఫైనల్లో దాయాదుల ఢీ?!
ఈ ఏడాది ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్లు మూడు సార్లు తలపడే అవకాశం కనిపిస్తోంది. గ్రూప్ దశలో సెప్టెంబర్ 14న దాయాదులు ఢకొీట్టనున్నాయి. ఆ తర్వాత సూపర్ 4 దశలోనూ పొరుగు దేశాలు పోటీపడనున్నాయి. సూపర్4లో భారత్, పాక్ టాప్-2లో నిలిస్తే ఫైనల్లోనూ ఢకొీట్టేందుకు అవకాశం ఉంది. ఆసియా కప్ ఫైనల్లో భారత్, పాక్ ఎన్నడూ పోటీపడలేదు. కొత్త ముఖాలతో యుఏఈకి వచ్చిన పాకిస్తాన్ తనదైన శైలిలో నిలకడలేని స్వరూపంతో కనిపిస్తోంది. భారత్, పాక్ టైటిల్ పోరులో పోటీపడితే అభిమానులతో పాటు ప్రసారదారుకు పండుగే!.