నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
నవతెలంగాణ – సిటీబ్యూరో
జీహెచ్ఎంసీ పరిమితుల విస్తరణ, కోర్ అర్బన్ రీజియన్ మొత్తం విలీనంతో నగర పాలనను మరింత సమర్థవంతం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల సంఖ్యను 300లకు పెంచుతూ నిర్ణయిస్తూ సోమవారం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ శాఖ (ఎంఏయూడీ) జారీ చేసిన జీఓ నంబర్ 266 ప్రకారం జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీ ఆర్గనైజేషన్ ఫ్రేమ్వర్క్ అధ్యయన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ అధ్యయనాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో నిర్వహించారు. విస్తరించిన నగర పరిమితులు, పెరుగుతున్న జనాభా గణాంకాలు, సేవల డెలివరీ అవసరాల ప్రకారం 300 వార్డులు అవసరమని కమిషనర్ ప్రతిపాదనలో వివరించినట్టు జీఓలో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ చట్టం-1955 నిబంధనల ప్రకారం వార్డుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఈ నోటిఫికేషన్ను తెలంగాణ ఎక్స్ట్రార్డినరీ గెజిట్లో ప్రచురించాలని ఆదేశించారు. ముద్రణ శాఖకు 500 ప్రతులను ప్రభుత్వానికి అందించాలని కూడా సూచించారు. జీహెచ్ఎంసీలో వార్డుల పునర్విభజన, భవిష్యత్తులో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలకు కీలకంగా మారనుంది.



