నవతెలంగాణ-హైదరాబాద్: వీధి కుక్కల బెడద కేసు విచారణ సందర్భంగా మరోసారి దేశ సర్వోన్నత న్యాయంస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధుల్లో సంచరించే కుక్కలు తరచూ వాహనాలకు అడ్డుపడి ప్రమాదాలకు కారణమవుతున్నాయని గుర్తుచేసింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో వీధి కుక్కలను షెల్టర్ హోంలకు తరలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై దాఖలైన పిటిషన్ ను ధర్మాసనం ఈ రోజు విచారించింది.
ప్రమాదం జరిగాక చికిత్స తీసుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడడం మంచిదని ధర్మాసనం అభిప్రాయపడింది. వీధుల్లో, స్కూళ్లు, విద్యాసంస్థల చుట్టుపక్కల కుక్కలు సంచరించాల్సిన అవసరం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. వీధుల్లో సంచరించే ప్రతీ కుక్క మనుషులను కరవకపోవచ్చు కానీ రోడ్లపై అవి అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం మాత్రం ఉందని ధర్మాసనం పేర్కొంది.



