నవతెలంగాణ-హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రూపొందిన బీసీ బిల్లు రాష్ట్రంలోని విపక్షపార్టీల ఆమోదంతో అసెంబ్లీలో ఆమోదం పొందిందని, ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో చట్టం చేసేందుకు ఉభయ సభల్లో తమ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విపక్ష ఎంపీలు కూడా ఈ బిల్లుకు ఉభయ సభల్లో మద్దతు తెలపాలని కోరారు. కులగణనలో తెలంగాణ రాష్ట్రం దేశానికి మోడల్ గా నిలిచిందని, భవిష్యత్తులో మిగతా రాష్ట్రాలకు రిఫరెన్స్ గా నిలుస్తుందని వెల్లడించారు.
తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై మంగళవారం సెక్రెటేరియట్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోషియో-ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే (SEEEPC)ను దేశంలోనే చారిత్రాత్మకమైన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో నిర్వహించిన ఈ సర్వేను ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో జనాభా లెక్కలతోపాటు కులగణనకు ముందుకు వచ్చిందన్నారు.