Saturday, June 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంమా ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు

మా ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు

- Advertisement -

బీజేపీ ఎంపీలు
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు
సిట్‌కు ఇద్దరు నేతల వాంగ్మూలం
నా ఫోన్లనూ వదలలేదు :
ఓ తెలుగు దినపత్రిక ఎండీ సాక్ష్యం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం తమ ఫోన్లను ట్యాపింగ్‌ చేసిందని బీజేపీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావులు శుక్రవారం సిట్‌ అధికారుల ఎదుట వాంగ్మూలమిచ్చారు. జూబ్లిహిల్స్‌లోని సిట్‌ కార్యాలయానికి వచ్చి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సాక్ష్యమివ్వగా, నగరంలోని ఒక ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రఘునందన్‌రావు వద్దకు సిట్‌ అధికారులు వెళ్లి ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తమ ప్రతీ ఫోన్‌కాల్‌నూ ట్యాపింగ్‌ చేశారనీ, వాటి ఆధారంగా తమ సహచర నాయకులు, సన్నిహిత కార్యకర్తలను పోలీసులు ఇబ్బందులపాల్జేశారని వారు తెలిపారు. ముఖ్యంగా, తమ కుటుంబీకుల ఫోన్లనూ ట్యాపింగ్‌ చేసి అత్యంత దుర్మార్గానికి పాల్పడ్డారని వారు చెప్పారు. ఈ మూడు ఉప ఎన్నికల సందర్భంగా తమ ప్రతీ కదలికలపై ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయటం ద్వారా నిఘా వేసి మానసిక హింసకు గురి చేశారని ఇద్దరు నాయకులు వాంగ్మూలమిచ్చారు.
బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చాక తనపై వ్యక్తిగత కక్షతో ఆ పార్టీ నాయకత్వం తనను వెంటాడిందని విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తన దగ్గరి స్నేహితుడి రూ.72 కోట్లను తనవిగా సీజ్‌ చేశారనీ కొండా తెలిపారు. మరో వ్యక్తికి తన భూమిని రూ.13 కోట్లకు విక్రయించగా ఆ వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లను రాయించుకున్నారని సాక్ష్యమిచ్చారు. తన ప్రతిష్టను దిగజార్చటానికి బీఆర్‌ఎస్‌ నాయకత్వం పోలీసు అధికారులను వినియోగించి ఫోన్‌ట్యాపింగ్‌లు చేయించిందని ఎంపీ రఘునందన్‌రావు వివరించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో ప్రజాస్వామ్యం మంటగలిసిందనీ, కేవలం కేసీఆర్‌ నాయకత్వంలోనే ఇవన్నీ అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు.
ఈ దుశ్చర్యలకు పాల్పడిన అప్పటి డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు సంబంధిత అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావులు డిమాండ్‌ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓ తెలుగు దినపత్రిక ఎండీ సైతం సిట్‌ ఎదుట హాజరై, తన ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేశారనీ, వాటిపై క్షుణ్ణంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -