Tuesday, December 2, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్రెండో విడతలో పంచాయతీల ఏక్రగీవాలు

రెండో విడతలో పంచాయతీల ఏక్రగీవాలు

- Advertisement -

– ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 9 గ్రామాల పాలకవర్గాలు ఏకగ్రీవం
– ములుగు, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ..
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి /గోవిందరావుపేట/ స్టేషన్‌ఘన్‌పూర్‌/గంభీరావుపేట

ఉమ్మడి మెదక్‌ జిల్లా, ములుగు, జనగామ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రెండో విడత నామినేషన్ల దాఖలుతోపాటు సర్పంచ్‌ పదవుల ఏకగ్రీవాలు జరిగాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా అందోల్‌ మండలం తాడ్మాన్నూర్‌ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి వీరారెడ్డి తాడ్మాన్నూర్‌ నుంచి అక్సాన్‌పల్లి వరకు 5కిలోమీటర్లు గుర్రంపై ర్యాలీగా వచ్చి నామినేషన్‌ ధాఖలు చేశారు. మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో ఇసుకుపాయల తాండ దూవసోత్‌ కవిత, సంగారెడ్డి పేటకు బాలమణి, మాడ్‌శెట్టిపల్లికి గాజుకుమార్‌, గట్టుకుంది తండాకు రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవ్‌పూర్‌ మండలంలోని పలుగుగడ్డ, కొండాపూర్‌, అనంతసాగర్‌ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సిద్దిపేట జిల్లాలోని దౌల్తాబాద్‌ మండలం లింగాయిపల్లి తాండ, సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిల తాండ సర్పంచ్‌, 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కోటగడ్డ, తీగలతండా సర్పంచ్‌ ఏకగ్రీవం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని కోటగడ్డ గ్రామపంచాయతీ ఏకగ్రీవం అయింది. ఈ పంచాయతీ సర్పంచ్‌ నామినేషన్లలో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. సర్పంచ్‌ అభ్యర్థిగా బానోత్‌ లిల్లీ నియామకం లాంఛనం అయింది. మండల వ్యాప్తంగా 154 వార్డులలో 30 వార్డులకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్‌ దాఖలు కావడంతో వీటిని కూడా అదే రోజు ఏకగ్రీవమైనట్టుగా అభ్యర్థుల పేర్లతో ప్రకటించనున్నారు. మరో నాలుగు వార్డులలో (రంగాపురంలో ఒకటి, కోటగడ్డలో మూడు) ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. అలాగే, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం చిల్పూర్‌ మండలంలోని తీగల తండా గ్రామ సర్పంచ్‌గా తీగల సాంబరాజు యాదవ్‌ను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామంలో ఎనిమిది వార్డులున్నాయి. ఒక్కో వార్డుకు ఒక్కో సభ్యుడిని ఎన్నుకుని వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. ఉపసర్పంచ్‌ స్థానం మాత్రం పెండింగ్‌లో ఉంది.

హీరలాల్‌ తండా పాలక వర్గం ఏకగ్రీవం
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని హీరలాల్‌ తండాకు ఎస్టీ మహిళా రిజర్వేషన్‌ రావడంతో గ్రామ సర్పంచ్‌గా భూక్య పద్మ దేవుసింగ్‌, ఉప సర్పంచ్‌గా అజ్మెరా కిషన్‌తో పాటు పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామస్తులు ఏకగ్రీవంగా పాలక వర్గాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తండా నూతన గ్రామ పంచాయతీ ఏర్పడటంతో ప్రజలు అభివృద్ధి కోసం పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సోమవారం తీర్మానం చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -