నవతెలంగాణ – హైదరాబాద్: మన దేశంలో ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పేరు పార్లే-జీ. చౌకగా లభించే తినుబండారాల్లో పార్లే బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లే-జీ బిస్కెట్లు వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక ధరకు అమ్ముడవుతుండటం గమనార్హం. ఈ మేరకు ఆంగ్ల మీడియా ఎన్డీటీవీలో కథనం వచ్చింది.
గాజా నుంచి ఇటీవల వైరల్ అయిన ఒక పోస్టులో, ముంబై కేంద్రంగా పనిచేసే పార్లే ప్రొడక్ట్స్ తయారుచేసిన పార్లే-జీ బిస్కెట్ ప్యాకెట్ 24 యూరోలకు (సుమారు రూ. 2,342) పైగా అమ్ముడవుతోందని ఒక వ్యక్తి పేర్కొన్నాడు. భారత్లో అత్యంత చౌకైన ఆహార పదార్థాలలో ఒకటిగా నిలిచిన ఈ బిస్కెట్ల ధర అంత ఎక్కువగా ఉండటం చూసి సామాజిక మాధ్యమంలో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
“చాలా కాలం నిరీక్షణ తర్వాత, రఫీఫ్కు ఇష్టమైన బిస్కెట్లను ఈరోజు నేను సంపాదించగలిగాను. వాటి ధర 1.5 యూరోల నుండి 24 యూరోలకు పైగా పెరిగినప్పటికీ, రఫీఫ్కు ఇష్టమైన ఈ చిరుతిండిని కాదనలేకపోయాను” అని ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్టును మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి ఇటీవల షేర్ చేశారు.
అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తులను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. “సమస్య సరఫరాదారులతో లేదా పన్నులతో కాదు” అని గాజా నగరంలో నివసిస్తున్న సర్జన్ డాక్టర్ ఖలీద్ అల్షవ్వా చెప్పారు. “ఈ వస్తువులు సాధారణంగా మానవతా సహాయం కింద ఉచితంగా గాజాలోకి వస్తాయి. కొద్దిమంది చేతిలోకి మాత్రమే అవి వస్తాయి. కొరత కారణంగా ఇవి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముడవుతాయి” అని ఆయన వివరించారు. పార్లే-జీ ధర కొన్నిచోట్ల రూ. 2,000 పలుకుతున్నప్పటికీ, తాను మాత్రం రూ. 240కి కొనుగోలు చేయగలిగానని సదరు సర్జన్ తెలిపారు. ఉత్తర గాజాలో కొన్ని ముఖ్యమైన ఉత్పత్తుల ప్రస్తుత మార్కెట్ ధర భారతీయ రూపాయిలో చూస్తే, ఒక కిలో చక్కెర రూ. 4,914, ఒక లీటర్ వంట నూనె రూ. 4,177, ఒక కిలో బంగాళాదుంపలు రూ. 1,965, ఒక కిలో ఉల్లిపాయలు రూ. 4,423, ఒక కప్పు కాఫీ రూ. 1,800గా ఉన్నాయి.