నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని పాశమైలారంలో ఉన్న సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో సంభవించిన రియాక్టర్ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ భయంకరమైన ప్రమాదంలో ఇప్పటికే 36 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అయితే.. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, సుమారు 40 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన తమ ఆత్మీయుల కోసం కుటుంబ సభ్యులు పడుతున్న వేదన వర్ణనాతీతం.
సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ.. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం ఈ ప్రక్రియకు పెద్ద అడ్డంకిగా మారింది. శిథిలాల కిందే గల్లంతైన వారు ఉండి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల నుంచి నిరంతరం పొగలు వెలువడుతుండటంతో.. వారిని సజీవంగా కనుగొనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ పరిస్థితితో నిస్సహాయులైన బంధువులు తమ వారి ఆచూకీ కోసం దీనంగా రోదిస్తున్నారు.