Thursday, June 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రయివేటుకు ధీటుగా పెద్దవూర జెడ్పీహైస్కూల్..

ప్రయివేటుకు ధీటుగా పెద్దవూర జెడ్పీహైస్కూల్..

- Advertisement -

ఇంగ్లిష్‌ మీడియం విద్యాబోధనతో పాటు, డిజిటల్‌ తరగతులు
సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు
నవతెలంగాణ – పెద్దవూర
పేరుకే అది ప్రభుత్వ పాఠశాల. వసతుల్లో కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నుతున్నది. ఇంగ్లిష్‌ మీడియం, కంప్యూటర్‌ ల్యాబ్‌లు, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరాలు వంటి అనేక సౌకర్యాలు ఈ పాఠశాల సొంతం. 49  ఏండ్లుగా ఈ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు చూరగొంటున్నది. ఇక్కడ చదివిన ఎంతోమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లుగా, రాజకీయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక భూమిక పోషిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదే పెద్దవూర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రత్యేకత. మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యనభ్యసించడానికి ఇక్కడ పోటీపడుతుంటారు. 1976లో ఈ పాఠశాల ప్రారంభమైంది. 2008 సంవత్సరం వరకు పాత భవనంలోనే పాఠశాల కొనసాగింది.

-జెడ్పి మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి ప్రత్యేక శ్రద్ద: జెడ్పి మాజీ వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి తండ్రి నారాయణ రెడ్డి పాఠశాలకు స్థలాన్ని కేటాయించి 1976లో పాఠశాల ప్రారంభం చేశారు. ఇదే పాఠశాలలో కర్నాటి లింగారెడ్డి విద్యనభ్యసించడంతో తాను చదివిన పాఠశాల రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో 2009లో అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించారు. పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులను కూడా ఆయన కల్పించారు. దీంతో ప్రస్తుతం జిల్లాలోనే పాఠశాలల్లో పెద్దవూర హైస్కూల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మధ్యలో నీడనిచ్చే చెట్లు ఆహ్లాదాన్ని కలిగిగిస్తున్నాయి. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యాబోధన చేస్తున్నారు. ప్రారంభంలో 1500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యశించారు. గతంలో ఈ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టకముందు 900 విద్యార్థులుండగా.. ప్రస్తుతం 700 మంది విద్యనభ్యసిస్తున్నారు. దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్‌కు విద్యార్థులు పోటీపడుతుంటారు. కొత్త తరహా విధానాలతో కూడా బోధిస్తుండడంతో కార్పొరేట్‌ పాఠశాలల్లో కూడా అందని విద్య ఇక్కడ అందుతోంది. దీంతో జిల్లాలోనే పెద్దవూర పాఠశాలకు మంచి గుర్తింపు లభించింది.

-సీసీ కెమెరాల పర్యవేక్షణలో విద్యాబోధన: ఎంఈఓ..తరి రాము 2025-26 విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే భవనానికి రంగులు వేసి అందంగా ముస్తాబు చేశాము.
ఎక్కడాలేని విధంగా పెద్దవూర మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రతి తరగతి గదికి సీసీ కెమెరాలను అమర్చారు. విద్యార్థులు ప్రతి క్షణం విద్య, పాఠశాలలో క్రమశిక్షణగా మలుచుకునేలా ఈ సీసీ కెమెరాలు ఎంతో దోహదం చేస్తున్నాయి. ఉపాధ్యాయులంతా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చక్కటి విద్యాబోధన అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆంగ్ల మాధ్యమాన్ని కూడా విద్యార్థులకు అందిస్తున్నాము. దీనికనుగుణంగానే  ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందుగానే ఈ కార్యక్రమాలను తీసుకుని జిల్లాలోనే ఆదర్శంగా నిలిపాము. దీనికితోడు పాఠశాల ఉపాధ్యాయులు కూడా అంకితభావంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారంతో అవసరమైన వాటిని సమకూర్చుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు కంప్యూటర్‌, ఇంగ్లిష్‌ బోధన చేస్తున్నారు. దీంతో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్‌ను తలదన్నేలా ఫలితాలను సాధించి అద్భుతాలు సృష్టిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -