నల్లగొండ పట్టణంలో సురవరం సంస్మరణ సభ
నేటి తరానికి ఆదర్శప్రాయుడు : తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి
జిల్లా కేంద్రంలో సురవరం విగ్రహం నెలకొల్పేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం సుధాకర్రెడ్డి అని తెలంగాణ శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి సంస్మరణ సభ నల్లగొండ పట్టణంలోని జీఎల్గార్డెన్లో బుధవారం నిర్వహించారు. సురవరం చిత్రపటానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్రెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నివాళులర్పించారు.
అనంతరం గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్రెడ్డి విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ప్రజాపోరాటాల్లోకి దిగారన్నారు. నల్లగొండ ఎంపీగా రెండుసార్లు పని చేశారన్నారు. తామిద్దరం వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేశాము కానీ ఏనాడూ వ్యక్తిగత విమర్శ చేసుకోలేదని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరు సాధించేందుకు కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో తాను ఎప్పుడూ సంఘీభావం తెలిపానన్నారు. ప్రస్తుతం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కార్మికుల, కర్షకుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్లో తన తన గళాన్ని విప్పిన గొప్ప కమ్యూనిస్టు మేధావి సురవరం సుధాకర్రెడ్డి అన్నారు. ఒక్క కామ్రేడ్ వంద మందితో సమానమని, ఒక్కడు ఉన్నా ఎర్రజెండాతో అన్యాయాన్ని ప్రశ్నిస్తారని కొని యాడారు. సురవరం ప్రజలకు చేసిన సేవలను గుర్తిస్తూ జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం నెలకొల్పడంతో పాటు ఓ మంచి కార్యక్రమానికి పేరు పెట్టేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ..ప్రజా జీవితంలో ఎన్నో ఉద్యమాలకు నేతృ త్వం వహించిన సురవరం సుధాకర్ రెడ్డి ప్రజా ఉద్యమ దిక్సూచి అన్నారు. విద్యార్థి దశ నుంచే ధిక్కార స్వరంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి కమ్యూ నిస్టు పార్టీలో అత్యున్నత స్థాయికి చేరా రన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూల కంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు మేధావులలో తెలుగు తేజం సురవరం సుధాకర్రెడ్డి ఒకరన్నారు. దేశ ప్రజలు సంపూర్ణ మైన ఆరోగ్యంతో ఉండాలని, దోపిడీ లేని సమసమాజ స్థాపన కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు.
ఆయన ఆశయ సాధన కోసం ఎర్ర జెండాలు కలిసి ఐక్య ఉద్యమాలు నడిపేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కమిటీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్నాయక్, నెల్లికంటి సత్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్రావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్రెడ్డి, లొడంగి శ్రవణ్కుమార్, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, పల్లె నరసింహ, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మెన్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్రెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉజ్జిని యాదగిరి రావు, పబ్బు వీరస్వామి, గురిజ రామచంద్రం, బంటు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES