నవతెలంగాణ-హైదరాబాద్: ఇండిగో సంక్షోభం తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చేరింది. విమానాల రద్దుపై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. పరిస్థితి తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దీనిపై తక్షణమే విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంజ్ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ, డీజీసీఏను ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను సుప్రీం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజు కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. శనివారం ఉదయం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబయి, కోల్కతా సహా అన్ని ఎయిర్పోర్టుల్లో 470 కిపైగా విమానాలు క్యాన్సెల్ అయ్యాయి. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రకటన విడుదల చేసింది. సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, అయితే కొన్ని సరీసులపై ప్రభావం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రైల్వే కూడా రంగంలోకి దిగింది. సాధ్యమైనంత త్వరగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు 37 రైళ్లకు 116 బోగీలను జోడించింది.
పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడమే తమ తక్షణ కర్తవ్యమని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించిన సంగతి తెలిసిందే.



