– హర్మూజ్ జలసంధి మూసివేత ఫలితం
– ఐదు నెలల గరిష్టానికి చమురు ధరలు
– మరింత పెరగొచ్చు : గోల్డ్మన్ సాచ్స్
– భారత జీడీపీపైనా ఒత్తిడి : ఇక్రా
ముంబయి: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులతో క్రూడ్ ఆయిల్ ధరలు ఐదు నెలల గరిష్టానికి చేరాయి. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చడంతో ఈ పరిస్థితి తలెత్తింది. సోమవారం ముడి చమురు బ్యారెల్ ధర 2.7శాతం పెరిగి 79.12 డాలర్లను చేరింది. అమెరికా క్రూడ్ బ్యారెల్ ధర 2.8శాతం ఎగిసి 75.98 డాలర్లుగా నమోదయ్యింది. అమెరికా దాడుల తర్వాత హర్మూజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ జలసంధి నుంచే ప్రపంచానికి అవసరమయ్యే మొత్తం చమురులో దాదాపు 24 శాతానికిపైగా సరఫరా అవుతుంది. ఉద్రిక్తతలు ఎక్కువ కాలం కొనసాగితే చమురు ధరలు మరింత ఆందోళనకర స్థాయికి పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశ ముడి చమురులోనూ దాదాపు 45 నుంచి 50 శాతం వరకు హర్మూజ్ జలసంధి ద్వారానే వస్తుంది.
హర్మూజ్ జలసంధి ద్వారా చమురు ప్రవాహం ఒక నెల పాటు సగానికి తగ్గితే బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 110 డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్మన్ సాచ్స్ అంచనా వేసింది. జూన్ 13న ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చమురు మార్కెట్లో అసాధారణమైన అస్థిరతకు దారితీస్తాయని మార్కెట్ నిపుణులు అజరు బగ్గా పేర్కొన్నారు. ఇరాన్- ఇజ్రాయిల్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత జీడీపీని ప్రభావితం చేసే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషించింది. ఎగుమతుల కంటే దిగుమతులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం ద్వారా కరెంట్ ఖాతా లోటు పెరగొచ్చని పేర్కొంది. ఇది భారత జీడీపీపై ఒత్తిడి పెంచనుందని విశ్లేషించింది.
పెట్రోల్ లీటర్ ధర రూ.120?
ఇరాన్..ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా భారత్లో పెట్రోల్ ధరలు పెరగనున్నాయని కేంద్రం సంకేతాలిస్తోంది. భారతదేశం రోజుకు 5.5 మిలియన్ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంది, అందులో 1.5-2 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే హార్ముజ్ జలసంధి నుంచి వస్తాయి. మిగిలిన 4 మిలియన్ బ్యారెళ్లు రష్యా, అమెరికా, పశ్చిమ ఆఫ్రికా , బ్రెజిల్ వంటి దేశాల నుంచి వస్తాయి. జూన్ 2025లో భారతదేశం రష్యా నుంచి రోజుకు 2.16 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది.
ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించినందున.. 2019 తర్వాత భారతదేశం ఇరాన్ నుంచి చమురు దిగుమతిని దాదాపు నిలిపివేసింది. కానీ ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ , కువైట్ వంటి దేశాల నుంచి 40 శాతం చమురు ఈ మార్గం ద్వారా వస్తుంది. జలసంధిని మూసివేస్తే, కేప్ ఆఫ్ గుడ్ హౌప్ వంటి ప్రత్యామ్నాయ మార్గాల నుంచి చమురు తీసుకురావాల్సి ఉంటుంది. దీనికి 7-13 రోజులు ఎక్కువ సమయం పడుతుంది. ఒక్కో ట్రిప్కు అదనంగా ఒక మిలియన్ యూఎస్ డాలర్లు (రూ.8.66 కోట్లు) ఖర్చవుతుంది.
భారత్లో ఉన్న నిల్వలు
భారతదేశంలో పుడూర్ (2.25 మిలియన్ మెట్రిక్ టన్నులు), విశాఖపట్నం (1.33 మిలియన్ మెట్రిక్ టన్నులు) , మంగళూరు (1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు)లలో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్నాయి.
ముడిచమురు ధరలు తగ్గినా..బాదుడే
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా..కేంద్రంలోని మోడీ సర్కార్ బాదేస్తోంది. అయితే ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేతను కూడా అవకాశంగా తీసుకుని పెట్రోల్ ధరలు పెంచే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెరగనున్న పెట్రోల్ ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES