నవతెలంగాణ – హైదరాబాద్: పంజాబ్లో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. కేవలం రూ. 8 లక్షల లంచం ఆరోపణలతో మొదలైన కేసులో సోదాలు చేయగా ఆయన నివాసంలో ఏకంగా రూ. 5 కోట్ల నగదు కట్టలు బయటపడటం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో రోపర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) హర్చరణ్ సింగ్ భుల్లార్ను, అతడి మధ్యవర్తి కృష్ణాను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఫతేగఢ్ సాహిబ్కు చెందిన ఆకాశ్ బట్టా అనే స్క్రాప్ వ్యాపారి ఐదు రోజుల క్రితం సీబీఐకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన వ్యాపారానికి సంబంధించి తప్పుడు కేసులో ఇరికిస్తానని డీఐజీ భుల్లార్ బెదిరిస్తున్నారని, కేసును “సెటిల్” చేయడానికి రూ. 8 లక్షల లంచంతో పాటు ప్రతినెలా మామూళ్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ డబ్బును తన మధ్యవర్తి కృష్ణా ద్వారా పంపాలని డీఐజీ సూచించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ, నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పక్కా ప్రణాళికతో వల పన్నింది. చండీగఢ్లోని సెక్టార్ 21లో వ్యాపారి నుంచి మధ్యవర్తి కృష్ణా రూ. 8 లక్షలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. వెంటనే, ఫిర్యాదుదారుడితో డీఐజీకి ఫోన్ చేయించగా, డబ్బు అందినట్లు ఆయన ధ్రువీకరించారు. ఈ ఆధారంతో మొహాలీలోని కార్యాలయంలో ఉన్న డీఐజీ భుల్లార్ను, మధ్యవర్తి కృష్ణాను సీబీఐ బృందం అరెస్ట్ చేసింది.