నవతెలంగాణ-హైదరాబాద్ : హర్యానాలోని రోహ్ తక్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పోల్ విరిగిపడడంతో ఓ యువ ప్లేయర్ గ్రౌండ్ లోనే దుర్మరణం పాలయ్యాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. రోహ్ తక్ కు చెందిన బాస్కెట్ బాల్ ప్లేయర్ లఖన్ మజ్రా (16) బాస్కెట్ బాల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సమయంలో బాస్కెట్ బాల్ హూప్ను పట్టుకొని వేలాడుతుండగా పోల్ విరిగి అతడి మీద పడింది.
అక్కడే ఉన్న ఇతర క్రీడాకారులు వెంటనే లఖన్ ను పోల్ కింది నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, బహదూర్ గఢ్ లోని హోషియార్ సింగ్ స్టేడియంలో రెండు రోజుల క్రితం ఇలాంటి దుర్ఘటననే చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ పోల్ విరిగిపడడంతో 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.



