బెంగళూర్ ఎఫ్సీ కీలక నిర్ణయం
ఐఎస్ఎల్ నిర్వహణలో అనిశ్చితే కారణం
బెంగళూర్ : ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) 2025 సీజన్ సందిగ్థత ప్రాంఛైజీలు, ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇండియన్ ఫుట్బాల్ లీగ్లో అత్యంత విజయవంతమైన, ఆదరణ కలిగిన బెంగళూర్ ఎఫ్సీ మంగళవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. బెంగళూర్ ఎఫ్సీ జట్టు ఆటగాళ్లు, సిబ్బంది వేతనాలను నిలిపివేస్తున్నట్టు ప్రాంఛైజీ యాజమాన్యం ప్రకటించింది. ‘ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ భవిష్యత్పై కొనసాగుతున్న అనిశ్చితి వాతావరణం నేపథ్యంలో బెంగళూర్ ఎఫ్సీ ఎంతో కఠిన నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, సిబ్బంది వేతనాలను నిరవధికంగా నిలిపివేస్తున్నాం. ఫుట్బాల్ నిర్వహణ, నిలదొక్కుకోవటం భారత్లో అత్యంత సవాల్తో కూడుకున్నది. బెంగళూర్ ఎఫ్సీ ప్రతి సీజన్ను ఒడిదొడుకులు ఎదుర్కొంటూ నిలబడింది. అయినా, లీగ్ నిర్వహణపై నీలినీడలు, అనిశ్చితి పరిస్థితులు మమ్మల్ని ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయి. ఫుట్బాల్ అభివృద్దికి, వృద్ధికి బెంగళూర్ ఎఫ్సీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది’ అని బెంగళూర్ ఎఫ్సీ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూర్ ఎఫ్సీ ఆధ్వర్యంలో నడుస్తున్న బిఎఫ్సి సాకర్ స్కూల్స్పై ఈ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని, అవి యథావిధిగా నడుస్తాయని తెలిపింది. అనిశ్చితితో ఎవరికీ ఉపయోగం ఉండదు. భారత ఫుట్బాల్ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఐఏఎఫ్ఎఫ్, ఎఫ్ఎస్డిఎల్ ఐఎస్ఎల్ నిర్వహణపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా బెంగళూర్ ఎఫ్సీ సూచించింది. 2018-19 సీజన్లో ఐఎస్ఎల్ చాంపియన్గా బెంగళూర్ ఎఫ్సీకి భారత సాకర్ సూపర్స్టార్ సునీల్ ఛెత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూర్ ఎఫ్సీ ప్రముఖ వ్యాపార సంస్థ జిందాల్ సౌత్ వెస్ట్ (జెఎస్డబ్ల్యూ) యాజమాన్యంలో నడుస్తున్న విషయం గమనార్హం.
ఆటగాళ్లకు జీతాలు బంద్
- Advertisement -
- Advertisement -