రిటర్నింగ్ అధికారిని ఆదేశించండి : నల్లగొండ కలెక్టర్కు చింతమల్ల కల్పన అభ్యర్థన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు తీర్పు మేరకు ఓటర్ల జాబితాలో తన పేరును పొందుపర్చి, సర్పంచి నామినేషన్ను ఆమోదించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్కు మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన చింతమల్ల కల్పన(ధరావత్ కల్పన) విన్నవించారు. మంగళవారం ఈ మేరకు నల్లగొండ కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. ‘చింతమల్ల రాంప్రసాద్ని నేను ప్రేమించి పెండ్లి చేసుకున్నాను. వివాహమైనప్పటి నుంచి ఇందుగుల గ్రామంలోనే నివాసముంటున్నాను. మాకు సంతానం కూడా కలదు. నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని 252 పోలింగ్ స్టేషన్లో 951 క్రమ సంఖ్యలో నాకు ఓటు హక్కు ఉంది.
అయితే, ఇందుగుల పంచాయతీ ఓటర్ల జాబితాలో నా పేరు నమోదు చేయలేదు. దీనిపై హైకోర్టును ఆశ్రయించాను. ఓటు హక్కు కల్పించాలని హైకోర్టు ఇచ్చిన సూచనను ఎన్నికల అధికారులు పట్టించుకోలేదు. పైగా దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. నాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఇందుగుల పంచాయతీ ఓటర్ల జాబితాలో నా పేరు చేర్చాలి. నేను వేసిన నామినేషన్ను ఆమోదించేలా రిటర్నింగ్ అధికారిని ఆదేశించాలి. నా నామినేషన్ చెల్లుబాటయ్యే విధంగా చర్యలు తీసుకోగలరు’ అని కలెక్టర్ను కోరారు. హైకోర్టు తీర్పు ప్రతిని లేఖకు కల్పన జత చేశారు.



