నవతెలంగాణ-ముధోల్: నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో గత వారం క్రితం హంగిర్గా బోజన్న అనే రైతుకు చెందిన పశువులు గుర్తు తెలియని దొంగలు చోరికి పాల్పడిన కేసులో ఒక్కరిని అరెస్టు చేసిన్నట్లు భైంసా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ముధోల్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ విలేకరులకు వివరాలు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఈ కేసులో ముధోల్ సిఐ మల్లేష్, భైంసా టౌన్ సిఐ గోపినాద్,బైంసా రూరల్ సిఐ నైలు, ముధోల్ ,తానుర్ ఎస్ఐలు బిట్ల పెర్సిస్, జుబేర్ , ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ద్వారా.. మహారాష్ట్రతో పాటు, ఆయా రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో మహారాష్ట్రలోని నాందేద్కు చెందిన మహ్మద్ పైజాన్ను అరెస్టు చేసినట్టు చెప్పారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులు పరారులో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పశువులు దొంగతనానికి ముధోల్కు దొంగలు వచ్చినపుడు నిందితుల వాహనం సీపీ కెమెరాలో కనిపించడంతో ఐటి కోర్, సిసిఎస్ పోలీసుల సాయంతో సాంకేతిక ఆధారాలతో ఈ కేసును చేధించామన్నారు. సీసీ కెమెరాలో కనిపించిన వాహనాన్ని నాందేడ్ గ్యారేజీలో గుర్తించామని తెలిపారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసుకుని,నిందితుడిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఈ పశువుల దొంగతనం ముఠా ముందుగా వాహనాల్లో సీట్లను తొలగించి ఆరుబయట ఉన్న పశువులకు మత్తు ఇంజిక్షిన్ ఇచ్చి, దొంగలిస్తున్నారని తెలిపారు.
దొంగలించిన పశువులను తెలంగాణ సరిహద్దుల్లో పశువుల మాంసాన్ని తీసుకెళ్లి, కళేబరాలను వదిలి వెళుతున్నారని తెలిపారు. మహారాష్ట్రలో పశు మాంసం బందు ఉండటంతోపాటు, డిమాండ్ ఉండటంతో ఈ దొంగతనాలు జరుగుతున్నాయని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. అనుమతి లేకుండా వాహనం లో సీట్లను తొలగిస్తే మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు .
ఇప్పటికే బైంసాలో రెండు వాహనలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాహనాల పై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా మోటార్ వెహికల్ అధికారికి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. పోలీసుల పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బైంసా రూరల్ సీఐ నైలు, ముధోల్ ఎస్సై బిట్ల పెర్సిస్ పాల్గొన్నారు.