నవతెలంగాణ – హైదరాబాద్: లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు.. కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఐదు నెలల జీతాలు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కార్మికులు ధర్నా నిర్వించారు. జీతాలు, పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మధ్యాహ్న భోజన కార్మికులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మహిళా కార్మికులందరినీ బలవంతంగా పోలీసు వ్యాన్లలో ఎక్కించి, ఆయా పోలీసు స్టేషన్లకు తరలించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈక్రమంలో పోలీసులు, కార్మికులకు మద్య తోపులాట జరిగి కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.